కరోనా ఆపత్కాలంలో ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల వసూళ్లపై ‘ప్రైవేటు బడి..అంతులేని దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్రైట్స్ (టీఎస్సీపీసీఆర్) సుమోటోగా స్వీకరించింది. ఈ విషయాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించి, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఏప్రిల్ 6వ తేదీలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా విద్యాధికారికి ఆదేశాలు జారీచేసింది. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరించి బలవంతంగా పుస్తకాలు, యూనిఫామ్స్ కొనుగోలు చేయించడం, టర్మ్ ఫీజు వసూలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.