సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రాజెక్టులు చేపడుతున్నది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పని చేస్తున్న హెచ్ఎండీఏ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నది. ముఖ్యంగా గ్రేటర్ చుట్టూ 50 కి.మీ వరకు విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో రోడ్లు, ఫ్లైఓవర్లు, పార్కులు, పచ్చదనం పెంపొందించడం వంటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతూ వస్తున్నది.
పట్టణీకరణ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్రాధాన్యతనిస్తున్నది. అందులో భాగంగానే గత కేసీఆర్ ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించడంతోపాటు కొన్ని ప్రాజెక్టులకు టెండర్లను సైతం పిలిచి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించడంలో జాప్యం జరుగుతున్నది. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్గా దానకిశోర్, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా అమ్రపాలి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కో విభాగంపై సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణ ప్రణాళికా విభాగం, రెవెన్యూ, ఎస్టేట్ విభాగాలపై మెట్రో పాలిటన్ కమిషనర్ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. మిగతా విభాగాలపై సమీక్షలు పూర్తికాకపోవడంతో ప్రాజెక్టుల పనులు చేపట్టడంలో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. ప్రాజెక్టుల వారీగా సమీక్ష చేసిన తర్వాతే పనులు మొదలయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత ఉన్న పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో హెచ్ఎండీఏ ప్రాజెక్టులను చేపట్టింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మైసిగండి చౌరస్తా నుంచి బౌరంపేట, బాచుపల్లి, నిజాంపేట మీదుగా మియాపూర్ వరకు రహదారిని విస్తరించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదేవిధంగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల వద్ద మూసీ నదిపై హైలెవల్ బ్రిడ్జీ, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హిమాయత్సాగర్ కింద ఉన్న ఈసా నదిపై రెండుచోట్ల హైలెవల్ బ్రిడ్జీలు, ప్రతాపసింగారం, బోడుప్పల్లోనూ మరో రెండు బ్రిడ్జీలను మూసీ నదిపై నిర్మించాలని టెండర్లు పిలిచారు. గత ఆగస్టులోనే వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచి గుత్తేదార్లను ఎంపిక చేశారు.
ఆ తర్వాత ప్రాథమికంగా నిర్ణయించిన ప్రాంతాల్లో భూములను చదును చేయడం వంటి పనులు చేపట్టారు. అదే సమయంలో ఎన్నికలు రావడంతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గత రెండు నెలలుగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రతిపాదిత బ్రిడ్జీల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జీలు, రోడ్ల విస్తరణ అవసరం ఎంతో ఉన్నది. ఇప్పటికే నగరంలోని ప్రధాన రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలతో నగర వాసులు నిత్యం సతమతమవుతున్నారు. కొత్తగా ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదించిన బ్రిడ్జీల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులను నిర్ణీత గడువు లోగా పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నుంచి, ఎక్కువ దూరం నుంచి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రతిపాదిత ప్రాజెక్టుల పనులు చేపట్టాలంటే కొత్తగా వచ్చిన మెట్రోపాలిటన్ కమిషనర్ పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన తర్వాత, వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ? ఎంత వ్యయం చేస్తున్నారు? దానికి సరిపడా నిధుల లభ్యత ఉందా? వంటి అంశాలను చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.