సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 6న హనుమాన్ జయంతి విజయ యాత్ర నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సోమవారం కమిషనరేట్లో విజయ యాత్ర బందోబస్తుపై డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ హనుమాన్ జయంతి ర్యాలీలు తీసే నిర్వాహకులు ముందస్తుగా స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టర్లు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమస్యాత్మకమైన ప్రాంతాలపై సునిశిత దృష్టి ఉంటుందని, ట్రాఫిక్ మళ్లింపులు వంటి వాటిపై దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి తన జాబ్ రోల్ క్లారిటీపై స్పష్టత ఉండాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ పి.శ్రీనివాస్రావు, మేడ్చల్ డీసీపీ సందీప్, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్, శంషాబాద్ డీసీపీ నారాయణ, ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, ఎస్ఓటీ డీసీపీ రషీద్, తదితరులు పాల్గొన్నారు.