బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ కార్యకర్తలు దగ్దం చేశారు.
ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని మేయర్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుంటే ఏ మాత్రం సాయం అందించని ప్రధాని మోడీ రాష్ట్ర ఏర్పాటే సక్రమంగా జరగలేదని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకులు సమర్థిస్తారా అని ప్రశ్నించారు.