సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ): ఇంటర్ పూర్తయి ఇంజినీరింగ్ విద్యలోకి ప్రవేశిస్తున్న వారి తొలి భయం ర్యాగింగ్. సీనియర్లతో ఎలా ఉండాలోనన్న ఆందోళన. క్యాంపస్ వాతావరణం, ఫ్యాకల్టీ కొత్త. వివిధ ప్రదేశాల్లో అభ్యసించిన వారంతా ఇక్కడ తోడవుతారు. ఎలా ఉంటుందోనని దిగులు చెందుతుంటారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్ను ఎప్పుడో నిషేధించాయి. ఒకవేళ ర్యాగింగ్కు పాల్పడితే కాలేజీ యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముందుగానే ర్యాగింగ్ చేయబోనని పేపర్పై రాయించి సంతకాలు సేకరిస్తున్నారు. ఇటీవల నగరంలోని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు ‘యాంటీ ర్యాగింగ్’ అప్లికేషన్ ఫారాలు ఇచ్చి…తప్పకుండా సంతకం చేసి సబ్మిట్ చేయాలని హుకుం జారీచేశారు. ర్యాగింగ్ను నిషేధించినా అక్కడక్కడ కాలేజీల్లో జరుగుతున్న ఘటనలు యాజమాన్యాల దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. గతంలో మాదిరి ప్రస్తుతం ర్యాగింగ్ లేదని..ఇటీవల కొన్ని ఘటనలు తమ దృష్టికి రావడంతో విద్యార్థులను అప్రమత్తం చేయాలనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపుతున్నామని వివరించారు. అంతేకాదు కాలేజీలో ర్యాగింగ్ చేస్తే సస్పెన్షన్ లేదా అడ్మిషన్ రద్దు చేస్తామని యాజమాన్యాలు హెచ్చరించాయి.
యాంటి ర్యాగింగ్ ఫారంలో ఇలా..
సుప్రీంకోర్టు జడ్జిమెంట్, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన యాంటి ర్యాగింగ్ నిబంధనలు తెలుసుకున్నాను.
నేను ర్యాగింగ్ అనబడేఎలాంటి చర్యల్లో పాల్గొనను. ర్యాగింగ్ ప్రచారంలో పాల్గొనను.
వాటిని ప్రోత్సహించను. నేను ఎవ్వరికీ హాని చేయను.భౌతికంగా, మానసికంగాఎవ్వరిని ఇబ్బంది పెట్టను.
నేను గతంలో ఎలాంటి ర్యాగింగ్ చర్యల్లో పాల్గొనలేదు. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం జత చేస్తున్నాను.
తల్లిదండ్రులకు కూడా అదే ఫారంలో.. ర్యాగింగ్కు పాల్పడితే తమ కుమారుడు లేదా కుమార్తెపై చర్యలు తీసుకోవచ్చని సంతకం చేయాలంటూ
ఫారం పంపుతున్నారు. ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు సంతకాలు చేసి కాలేజీలో సబ్మిట్ చేస్తున్నారు.
ర్యాగింగ్కు సంబంధించినఏ విషయాల్లోనైనా నేను కారణమైతే నాపై యూజీసీ నిబంధనల మేరకు చర్యలుతీసుకోవచ్చు.
లక్ష్య సాధనలో పోటీ పడాలి
గొప్ప లక్ష్యంతో కాలేజీలో అడుగుపెడతాం. లక్ష్య సాధనకు కఠినంగా శ్రమించాలి. తెలియని విషయాలను సీనియర్ల నుంచి నేర్చుకోవాలి. కానీ జూనియర్లని ఏడిపించడం సరికాదు. ఒకప్పుడు ర్యాగింగ్కు భయపడి కాలేజీ మానేసిన వారున్నారు. ర్యాగింగ్పై కాలేజీ యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
– రిషిత్, ప్రెసిడెంట్, స్ట్రీట్కాజ్
హార్డ్వర్క్, విజయాల్లో సంతోషం వెతుక్కోవాలి
ర్యాగింగ్తో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సుప్రీంకోర్టు,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు రూపొందించి చర్యలు తీసుకునేలా
యాజమన్యాలకు ఆదేశాలిచ్చాయి. మేం కూడాస్ట్రీట్ కాజ్ ద్వారా చాలామంది
విద్యార్థులకు ర్యాగింగ్ నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం.
మన సంతోషాన్ని హార్డ్వర్క్, విజయాల్లో వెతుక్కోవాలి.
ర్యాగింగ్తో ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు
ర్యాగింగ్ విద్యార్థుల ఆత్మసంకల్పాన్ని దెబ్బతీస్తుంది. కించపరిచేలా మాట్లాడటం, భౌతికంగా ఇబ్బందిపెట్టాలని చూడటం హేయమైనవి. కాలేజీల్లో ర్యాగింగ్ కల్చర్ చాలావరకు తగ్గింది. ర్యాగింగ్ చేసి రాక్షసానందం పొంది జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇతరుల జీవితాలను ఆగం చేయొద్దు.
-శ్రీలేఖ, స్టూడెంట్
ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి
మన లక్ష్యం మరే ఇతర కారణాలతో ఆగిపోవద్దు. ధైర్యంగా విజయం వైపునకు అడుగులేయాలి. ర్యాగింగ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి. భయంతో కాలేజీ మానేయడం సరికాదు. సీనియర్లు జూనియర్లతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలి.