బేగంపేట్ మార్చి 23: బేగంపేట్లో నెలకొన్న వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం బేగంపేట్ డివిజన్లో రూ. 1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి ప్రారంభించారు. పీజీ రోడ్డులో రూ.19.50 లక్షలతో చేపట్టిన సీవరేజ్ పైపులైన్ , పాటిగడ్డలోని ప్రభుత్వ పాఠశాల వద్ద రూ. 23 లక్షలతో సీసీ రోడ్డు, మోడల్ మార్కెట్ వద్ద రూ. 6 లక్షలతో సీసీ రోడ్డు, బ్రాహ్మణ వాడిలో వివిధ ప్రాంతాల్లో 1.10 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం బేగంపేట్ నాలాకు ఎగువ నుంచి వచ్చే వరద నీటితో నాలా వెంట ఉన్న కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టినట్లు వివరించారు. అందులో భాగంగా రూ. 45 కోట్లతో బేగంపేట్ నాలా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. బ్రాహ్మణవాడిలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ఆక్రమణలకు గురయ్యాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాటిగడ్డలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అదనంగా మరో రెండు తరగతి గదులు కావాలని కోరగా మంజూరు చేస్తామని మంత్రి హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, డీఈ సంతోష్, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, శ్రీనివాస్గౌడ్, శేఖర్ముదిరాజ్, మహ్మద్ అఖిల్ హమ్మద్, అక్బర్, నరేందర్ పాల్గొన్నారు.