సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ వ్యాపారం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ర్టాలకు చెందిన వారే కాకుండా ఉత్తర, దక్షిణ భారత దేశానికి చెందిన వారు సైతం హైదరాబాద్లో భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా పారదర్శకత, పక్కా ప్రణాళికతో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసే లే అవుట్లు అంటే ఎందరికో గురి. తాజాగా ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని ప్లాట్లను ఆన్లైన్ వేలం (ఈ-ఆక్షన్) ద్వారా విక్రయిస్తుండడంతో చాలా మంది ఎన్ఆర్ఐలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో నిర్వహించిన వేలం పాటలో 15-20 మంది ఎన్ఆర్ఐలు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద కరోనా తర్వాత హైదరాబాద్లో రియల్ రంగం మంచి వృద్ధి రేటును నమోదు చేస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయన్న నమ్మకం ఎన్ఆర్ఐలలో ఉంది.
హెచ్ఎండీఏ లే అవుట్లలో వసతులు..
హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లు అన్నీ ఎక్కువగా ఔటర్ రింగురోడ్డు లోపలే ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన తర్వాతే విక్రయించేందుకు హెచ్ఎండీఏ మొగ్గు చూపుతుంది. ప్రస్తుతం నగరంలోని ఉప్పల్ భగాయత్ లే అవుట్లోనూ 100 అడుగుల రోడ్లు మొదలు కొని, 80, 60,40, 33 అడుగుల వెడల్పుతో కూడిన రహదారులు పూర్తి స్థాయిలో నిర్మించింది. రోడ్లతో పాటు మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులను ఇప్పటికే ఏర్పాటు చేసింది. దీంతో ఇలాంటి చోట ప్లాట్లను కొనుగోలు చేస్తే మంచి భవిష్యత్తు, అభివృద్ధి ఉంటుందన్న నమ్మకంతో విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నేడు ప్రీ బిడ్ మీటింగ్..
ఉప్పల్ భగాయత్ లే అవుట్లోని ప్లాట్ల విక్రయానికి సంబంధించి మరోసారి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బేగంపేటలోని హరిత ప్లాజాలో ప్రీ బిడ్ మీటింగ్ను నిర్వహిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 2,3 తేదీల్లో జరగనున్న ఈ -ఆక్షన్కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విక్రయానికి 44 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ప్రీ బిడ్ సమావేశానికి హాజరు కావచ్చన్నారు.