శేరిలింగంపల్లి/మియాపూర్/కొండాపూర్/మాదాపూర్ డిసెంబర్ 28: శేరిలింగంపలి సర్కిల్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ప్రారంభమైంది. సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి మూడు డివిజన్లలో ఉదయం 8 గంటలకు ప్రజాపాలన కేంద్రాల్లో అధికార యంత్రాంగం సేవలను అందుబాటులో ఉంచారు. సర్కిల్ పరిధిలో మూ డివిజన్లలో డివిజన్(వార్డు)కు 4 కేంద్రాల చొప్పున మొత్తం 12 కేంద్రాలో సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.
సర్కిల్ పరిధిలోని పలు ప్రజా పాలన కేంద్రాల్లో ప్రజలు అయోమయపరిస్థితుల్లో కనిపించారు. 6 గ్యారంటీలకు సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలో అవగాహన కల్పించకపోవడంతో పలు కేంద్రాల్లో దరఖాస్తుదారులు ఫారాలు నింపేందుకు తికమకపడ్డారు. దీంతో పాటు దరఖాస్తు ఫారాలతో పాటు ఆధార్, ప్యాన్, గ్యాస్, కరెంట్ బిల్లు, తెల్లరేషన్ కార్డుల జిరాక్సులు జతచేయాల్సి ఉంది. కానీ చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలసవచ్చి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డులో ఒక అడ్రస్, కరెంటుబిల్లులో మరో అడ్రస్, రేషన్ కార్డులో ఇంకో అడ్రస్ ఉండడంతో పాటు గ్యాస్ బిల్లులు జతచేయాల్సి ఉండగా స్వస్థలం ఊర్లో చేసుకోవాలా, లేక ప్రస్తుతం ఉంటున్న నగరంలో చేసుకోవాలా అనే అయోమయం, గందరగోళం కేంద్రాల్లో దరఖాస్తుల కోసం వచ్చిన ప్రజల్లో స్పష్టంగా కనిపించింది.
సర్కిల్ పరిధిలోని పలు ప్రజాపాలన కేంద్రాలలో ప్రభుత్వం తరుపున అందిస్తున్న దరఖాస్తు ఫారాల కొరత స్పష్టంగా కనిపించింది. ఉదయం 8 గంటలకు దరఖాస్తులు ఇవ్వడం ప్రారంచించిన అధికారులు 11 గంటల వరకు ఫారాలు అందించి ఆ తర్వాత చేతులు ఎత్తేశారు. ప్రభుత్వం ముద్రించిన అసలైన దరఖాస్తుల కొరత ఉందని, తమకు ఇచ్చినవన్నీ అయిపోయాయని పేర్కొంటు కావాల్సిన వారు జిరాక్సులు తెచ్చుకోవాలంటు పేర్కొనడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో కేంద్రాల్లోని జిరాక్సు సెంటర్లకు పరుగులు తీశారు. ఆరు గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తులు జిరాక్సు దరఖాస్తు ఫారానికి రూ. 20 నుంచి 50 వరకు వసూలు చేశారు.
ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించిన శేరిలింగంపల్లి వెస్ట్జోన్ స్పెషల్ ఆఫీసర్, ఐఏఎస్ విజియేంద్ర బోయి పరిశీలించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించి కేంద్రం ఇన్చార్జి, డిప్యూటీ ఈఈ విశాలక్షీని అడిగి తెలుసుకున్నారు. కౌంటర్ల వద్ద ప్రజలు గుమిగూడకుండా చూడాలని, క్యూ పద్ధతిని పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజా పాలన దరఖాస్తులలో నెలకొన్న సందేహాలను ప్రజలకు నివృత్తి చేయాలని సూచించారు.
ఓకే ప్రాంతానికి చెందిన స్థానిక అంగన్వాడీ, ఆశవర్కర్లను అదే ప్రాంతంలోని ప్రజాపాలన కేంద్రంలో విధులు నిర్వర్తించడంపై స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గోపన్పల్లి ప్రాంతానికి చెందిన నలుగురు ఆశవర్కర్లు, అంగన్వాడీలు గతంలో ఎన్నికల సమయంలో ఓ పార్టీ తరుపున ఏజెంట్లుగా పనిచేసిన వారు ప్రస్తుతం అదే ప్రాంతమైన గౌలిదొడ్డి ప్రజాపాలన కేంద్రంలో విధులు నిర్వర్తించడం సరైందని కాదని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని వెస్ట్జోన్ స్పెషల్ ఆఫీసర్ విజియేంద్ర బోయికి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలోని 24 కు పైగా కేంద్రాలలో తొలి రోజు దరఖాస్తుల స్వీకరణను అధికారులు చేపట్టారు. జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీసీలు వంశీకృష్ణ, రజనీకాంత్లు, ప్రత్యేక అధికారులు పలు కేంద్రాలను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు.
ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయి నెరవేర్చాల్సిందేనని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలను రాజకీయాలకతీతంగా అర్హులందరికీ అందేలా తాను కృషి చేస్తానన్నారు. ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభోత్సవం నేపథ్యంలో తొలి రోజు ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ డివిజన్లలో అధికారి నవీన్రెడ్డి,ఇంద్రసేన, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, మాధవరం రోజాదేవిలతో కలిసి కేంద్రాలను ఎమ్మెల్యే గాంధీ గురువారం పరిశీలించారు.
– మియాపూర్, డిసెంబర్28