సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ ) : ప్రజాపాలన ముగిసింది. డిసెంబరు 28, 2023న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, శనివారం వరకు ( డిసెంబర్ 31, జనవరి 1వ మినహా) దరఖాస్తులను అధికారులు ప్రత్యేక కేంద్రాల ద్వారా స్వీకరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లతో పాటు కంటోన్మెంట్ బోర్డు కలిపి 650 కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరించారు. 8 రోజుల వ్యవధిలో మొత్తం 24,74,325 దరఖాస్తులు రాగా..ఇందులో అభయహస్తం కింద 19,01,256, ఇతర దరఖాస్తులు 5,73,069 ను స్వీకరించారు. ఆరు గ్యారంటీల పథకాల్లో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు రూ. 2,500లు, రూ.500లకు వంట గ్యాస్ రాయితీ, గృహలక్ష్మీ కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్పై ప్రజలు ఆసక్తిని కనబర్చారు. దీంతో పాటు కొత్త రేషన్కార్డుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు.
మొత్తం దరఖాస్తుల్లో 40 శాతం పాతనగరం నుంచే రాగా, కంటోన్మెంట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా దరఖాస్తులోని సమాచారాన్ని కంప్యూటరీకరించే పనులకు జీహెచ్ఎంసీ ప్రారంభించింది. రెండు రోజులుగా కేంద్ర కార్యాలయంలో సర్కిళ్ల వారీ అధికారులు, సమాచారాన్ని నమోదు చేసే ఏజెన్సీలకు శిక్షణ ఇచ్చారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్లను వినియోగించే విధానం, సమాచారాన్ని ఆన్లైన్ దరఖాస్తులో ఎలా నింపాలనే అంశాలపై అవగాహన కల్పించారు. సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీలోగా వచ్చిన 24.74 లక్షల దరఖాస్తుల డేటాను ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా పాలన చివరి రోజు శనివారం మొత్తం 322147 దరఖాస్తులు స్వీకరించారు.