ఖైరతాబాద్: ఆస్పత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్లు ఉంటాయి. ఒక్కోసారి అది పనిచేయకుంటే పరిస్థితి గందరగోళంగా మారిపోతుంది. నిమ్స్ దవాఖానలో శుక్రవారం అదే జరిగింది. పాత భవనంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. సరఫరా నిలిచిపోతే.. వెంటనే యూపీఎస్ బ్యాకప్ వస్తుంది. కానీ నిమ్స్లో బ్యాకప్ ఇవ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్లోని వైద్యులు కంగారుపడినట్లు సమాచారం. ఆపరేషన్ చేస్తున్న సమయంలో కరెంటు పోవడంతో డాక్టర్లు ఆందోళనకు గురైనట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ టెక్నిషియన్కు ఫోన్ చేస్తే సకాలంలో స్పందించనట్లు సమాచారం.
ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు కరెంటు లేక సుమారు అరగంట ఉక్కిరిబిక్కిరైనట్లు తెలిసింది. ఎట్టకేలకు ఎలక్ట్రీషియన్ను రప్పించగా సరిచేసినట్లు సమాచారం. ‘ఎండాకాలం కావడంతో విద్యుత్ లోడ్ అధికమై ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యుత్ సరఫరా కొంతసేపటి వరకు నిలిచిపోయిన విషయం నిజమే. అప్పుడప్పుడు లోడ్ పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే పరిష్కరిస్తాం’ అని వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ చెప్పారు.