సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విద్యుత్ అంతరాయాలను వేగంగా గుర్తించడం, వినియోగదారులకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ జూలై 1 నుంచి తన పరిధి వ్యాప్తంగా సమగ్ర విద్యుత్ నెట్వర్క్ మ్యాపింగ్ డ్రైవ్ను ప్రారంభిస్తున్నదని దక్షిణ డిస్కం సీఎండీ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. తొలిదశలో ఈ కార్యక్రమాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో అమలు చేయనున్నామని, దీని ద్వారా 132/33 కేవీ ఈహెచ్టీ సబ్స్టేషన్ల నుంచి 33/11 కేవీ సబ్స్టేషన్లు, 11కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లతోపాటు ప్రతీ వినియోగదారుడి సర్వీస్ కనెక్షన్ వరకు పూర్తిగా విద్యుత్ నెట్వర్క్ అనుసంధానాన్ని డిజిటల్ రూపంలో ఖచ్చితంగా నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో వినియోగదారుల సర్వీసులు, సంబంధిత డీటీఆర్లు, ఫీడర్ల మధ్య అనుసంధాన వివరాలు పూర్తిస్థాయిలో డిజిటల్ మ్యాపింగ్ కాలేదని, ఈ కార్యక్రమం ద్వారా ఆ లోటును పూర్తిగా తొలగించి, విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ మ్యాపింగ్ పూర్తయిన తర్వాత ఒక వినియోగదారుడి ఇంటికి విద్యుత్ ఏ ఈహెచ్టీ సబ్స్టేషన్ నుంచి, ఏ 33కేవీ ఫీడర్ ద్వారా, ఏ 11కేవీ ఫీడర్ ద్వారా, ఏ డీటీఆర్ ద్వారా చేరుతుందనే పూర్తి సమాచారం ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.
ఇందులో భాగంగా ఫీల్డ్ ఇంజనీర్లు ప్రతీ 11కేవీ ఫీడర్కు అనుసంధానమైన డీటీఆర్ల స్ట్రక్చర్ కోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరిస్తారన్నారు. జూలై నెల బిల్డింగ్ ప్రక్రియలో మీటర్ రీడర్లు ప్రతీ డీటీఆర్ను సందర్శించి ఆయా ట్రాన్స్పార్మర్లకు అనుసంధానమైన వినియోగదారుల సర్వీసులను ఖచ్చితంగా మ్యాపింగ్ చేస్తారని జితేశ్ పాటిల్ చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి కారణాలు, పునరుద్ధరణకు పట్టే సమయం వంటి వివరాలను వినియోగదారులకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించే అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సాంకేతికత, డిజిటలైజేషన్ను విస్తృతంగా వినియోగించడం ద్వారా వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన, నమ్మకమైన సేవలను అందించడమే లక్ష్యమని సీఎండీ జితేశ్ పాటిల్ తెలిపారు.