సిటీబ్యూరో, మార్చి 13(నమస్తే తెలంగాణ): సాధారణంగా రంజాన్ మాసంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.ఈ సంవత్సరం రంజాన్ ప్రార్థనల సమయంలో ముఖ్యంగా తెల్లవారుజాము భోజనం సెహ్రీ , ఉపవాస విరమణ ఇఫ్తార్ సమయాల్లో తరచుగా పవర్కట్ అవుతుండడంతో ముస్లింలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రంజాన్ సమయంలో ముఖ్యంగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియక కాలాపత్తర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్ , పురానీహవేలీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కోతలు సెహ్రీ, ఇఫ్తార్ సమయాల్లో ఉండడంతో ప్రార్థనలకు, ఆహార తయారీకి ఇబ్బందిగా ఉంటున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్కోతలు ఉండవంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అప్రకటిత కరెంట్ కోతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్యాక్షన్ ప్లాన్లో భాగంగా చాలా సర్కిళ్లలో పనులు ఎక్కడికక్కడే పెండింగ్లో ఉండడంతో రంజాన్ సీజన్లో కరెంట్ కోతలు ఉంటున్నాయని ఒక విద్యుత్ అధికారి చెప్పారు.
గ్రేటర్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల్లో భాగంగా పలుచోట్ల చేపట్టిన పనులు వేసవి ప్రారంభమైనప్పటికీ పూర్తి కాలేదు. డిసెంబర్లోనే పనులన్నీ పూర్తి చేసి కొన్ని చిన్నచిన్న పనులను జనవరి 31లోగా పూర్తిచేయాలని సీఎండీ ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు పాటించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. మార్చి మొదటి వారం తర్వాత విద్యుత్ లైన్ల క్లియరెన్స్(ఎల్సీ)లు ఉండవని డిస్కం ఉన్నతాధికారులు స్పష్టం చేసినా పలు సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు నిర్లక్ష్యం వీడడం లేదు.
రంగారెడ్డి, మెట్రో, మేడ్చల్ జోన్ల పరిధిలోని మేడ్చల్, సికింద్రాబాద్, హబ్సిగూడ, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్, సైబర్సిటీ, రాజేంద్రనగర్, బంజారాహిల్స్, సంగారెడ్డి, సరూర్నగర్ సర్కిళ్ల పరిధిలోని చాలా డివిజన్లలో ఇంకా సమ్మర్ యాక్షన్ పనులు పూర్తికాలేదు. గత సంవత్సరం మే మొదటివారంలో నమోదైన డిమాండ్ ఇప్పుడు మార్చి మొదటివారంలో రికార్డు స్థాయిలో నమోదవడంతో అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దీంతో పలుచోట్ల విద్యుత్ ఓవర్లోడ్ అయి ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. కొన్నిచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి.
కొత్తగా చేపట్టాల్సిన పనులు మాత్రం ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. పాతవాటి మరమ్మతుల విషయంలో కొన్ని జరిగినప్పటికీ మేజర్ వర్క్స్లో కదలికే లేదని సిబ్బంది పేర్కొన్నారు. అయితే పనులు చేసే క్రమంలో అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడం, సాంకేతికపరమైన కారణాల వల్ల కాగితాలపై ఉన్న వేగం, పని కొనసాగించడంలో లేదని విద్యుత్శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వేసవిలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో లైన్లపై ఓవర్లోడ్ పడకుండా ఫీడర్ల విభజనతో పాటు కొత్త ఫీడర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పనులు ఇంకా పూర్తి చేయలేదు. సిబ్బందికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడంలో టీజీఎస్పీడీసీఎల్ విఫలమవడంతోనే సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల నిర్వహణలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.