పోలీసుస్టేషన్, సబ్స్టేషన్ నిర్మాణం కూడా..
గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో టిమ్స్కుతోడు ఏర్పాటు
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వినతి
అంగీకరించిన ముఖ్యమంత్రి, నిర్మాణాలకు ఆదేశం
ఎల్బీనగర్ నియోజకవర్గానికి సీఎం వరాలు
ఎల్బీనగర్, ఏప్రిల్ 26 : గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో ఈ ప్రాంతంలో వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎంతో మేలు జరగనుంది. సాధారణ వైద్యసేవలతోపాటు అత్యవసర సమయంలో వేగంగా వైద్యమందనుంది. ఇప్పటివరకు ఉస్మానియా పైనే ఆధారపడాల్సి రాగా, ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే మరిన్ని వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వినతి.. సీఎం అంగీకారం
గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో నిర్మించ తలపెట్టిన టిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా పార్కు, రిజర్వాయర్, సబ్స్టేషన్, పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సీఎం కేసీఆర్కు విన్నవించారు. టిమ్స్ శంకుస్థాపన అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుతోపాటు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బస్సులో వెళ్లారు. 15 ఏండ్లుగా పండ్ల మార్కెట్ తరలింపునకు కృషి చేశానని సీఎంకు వివరించారు. ఎకరంలో పార్కు, 1000 గజాల్లో రిజర్వాయర్, 2వేల గజాల్లో విద్యుత్ సబ్స్టేషన్, 3వేల గజాల్లో పోలీస్స్టేషన్ నిర్మించాలని ఎమ్మెల్యే..సీఎం కేసీఆర్కు విన్నవించిన వెంటనే అంగీకరించారు. భవన నిర్మాణాలకు ముందే చెప్పడం మంచిదని సీఎం అన్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
నగరం నడిబొడ్డున..
వెంగళరావునగర్, ఏప్రిల్ 26 : నగరం నడిబొడ్డున ఎర్రగడ్డ ఛాతి దవాఖాన ఆవరణలో నిర్మించే టిమ్స్ వల్ల ప్రధానంగా నగరవాసులకు చక్కటి వైద్యసేవలు అందనున్నాయి. రూ.882 కోట్ల వ్యయంతో 1000 పడకలతో నిర్మించే సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. ఛాతి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ఖాన్ నేతృత్వంలో వైద్య సిబ్బంది ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. దవాఖాన నిర్మాణశైలి, ఇతర వసతుల గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ ఎంట్రీలో కేజీఎఫ్-2 బీజీఎం
అల్వాల్, ఏప్రిల్ 26 : అల్వాల్లో టిమ్స్ దవాఖానకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు సీఎం బహిరంగసభ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సభకు వచ్చిన వారిని తన పాటలతో గాయకుడు సాయిచంద్ అలరించారు. సీఎం సభా స్థలికి వచ్చే సమయంలో సాయిచంద్.. సీఎం కేసీఆర్ను వందమంది బాహుబలులు, కేజీఎఫ్లతో పోల్చారు. సీఎం వేదికపై కొస్తుండగా బ్యాక్గ్రౌండ్లో కేజీఎఫ్-2 సినిమా పవర్ఫుల్ బీజీఎం ప్లే చేశారు. సభకు హాజరైన మహిళలు కేసీఆర్ వాహనంపై గులాబీ పూలు చల్లి అభిమానం చాటుకున్నారు.