హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని అత్తాపూర్ (Attapur) వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. దీంతో 50 తులాల బంగారం లభించింది. సరైన పత్రాలు చూపించకపోవడంతో బంగారాన్ని (Gold) సీజ్ చేశారు. దాని విలువ రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. బంగారాన్ని ఆదాయపన్ను శాఖ (IT) అధికారులకు అప్పగించారు.
కాగా, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్లో భారీ ఎత్తున హవాల రాకెట్ గుట్టు మంగళవారం బయటపడింది. కారులో తీసుకెళ్తున్న ఆధారాలు లేని సొమ్ము ఒకే చోట రూ. 3.35 కోట్లు పట్టుబడింది. బంజారాహిల్స్తో పాటు సికింద్రాబాద్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, అబిడ్స్, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, బేగంపేట, అమీర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో సోదాలు కొనసాగాయి.