హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నేతలతో కలిసి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్స్లో సభ ముగిసిన అనంతరం ప్రధాని నేరుగా రాజ్భవన్కు వెళ్తారని చెప్పారు. ఆదివారం రాత్రి రాజ్భవన్లో ప్రధాని బస చేస్తారని తెలిపారు.
హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్భవన్ మార్గాల్లో 4 వేల మంది పోలీసులతో పహారా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సభకు వచ్చే వాహనాలకు కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ ఏరియాల్లో పార్కింగ్ స్థలాలను కేటాయించామని తెలిపారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించామని పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో 3 వేల మందితో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టార్ ఇంచార్జులుగా నియమించామని సీవీ ఆనంద్ చెప్పారు.