మన్సురాబాద్, మార్చి 17: మన్సురాబాద్ డివిజన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 12న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీ, వీరన్న గుట్ట, విజయనగర్ కాలనీల్లో రూ.71 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే సదరు శంకుస్థాపనల విషయంలో ఎమ్మెల్యే ప్రోటోకాల్ విస్మరించారని..కాలనీవాసులకు సమాచారం ఇచ్చిన తర్వాత తనకు తెలియజేశారంటూ.. ప్రోటోకాల్ నిబంధనలు పాటించనందున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపనలు చేసిన పనులను తిరిగి తాను ప్రారంభిస్తానని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సోమవారం ఉదయం సరస్వతి నగర్ కాలనీకి చేరుకున్నారు.
విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపనలు చేసిన పనులకు తిరిగి కార్పొరేటర్ రెండో సారి ఎలా శంకుస్థాపనలు చేస్తారని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యారు. కార్పొరేటర్ ను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతుండగా, అప్పటికే సరస్వతి నగర్ కాలనీ కి చేరుకున్న ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్ తదితరులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని అక్కడి నుంచి పంపించి వేశారు.
బీఆర్ఎస్ నేతలను ఈడ్చ్చుకెళ్లిన పోలీసులు..
సరస్వతి నగర్ కాలనీ నుంచి వీరన్న గుట్టకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులను హయత్ నగర్, వనస్థలిపురం సీఐలు అడ్డుకున్నారు. శంకుస్థాపన విషయంలో కార్పొరేటర్ సమాధానం చెప్పాకే తాము ఇక్కడి నుంచి కదులుతామంటూ బీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి తదితరులు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. జక్కిడి రఘువీర్ రెడ్డి తో పాటు మరికొందరిని పోలీసులు ఈడ్చుకొని లాక్కెళ్లి పోలీసు వ్యానులో అబ్దుల్లాపూర్మెట్ పీఎస్కు తరలించారు. అసభ్యకరమైన పదజాలంతో పోలీసులు తనను దూషించారని జక్కిడి రఘువీర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు బీజేపీ కార్పొరేటర్ కు వత్తాసు పలుకుతూ తమతో దురుసుగా వ్యవహరించారని.. పోలీసులు బీజేపీకి ఏజెంట్లుగా మారిపోయారంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డితో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.