సిటీబ్యూరో,అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఠాణా పరిధిలో రెండు నుంచి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంబంధిత పత్రాలు లేని నగదు, బంగారం, వెండితో పాటు ఓటర్లను ప్రభావితం చేసే ఇతర వస్తువులను సీజ్ చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 24/7 చెక్పోస్టులను నిర్వహిస్తూ తనిఖీలు జరుపుతున్నారు. మహానగరంతో పాటు ఇతర జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించే సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. తనిఖీలు పారదర్శకంగా ఉండే విధంగా ప్రతి తనిఖీని వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని నారాయణ గూడ పోలీసులు తనిఖీ చేయగా అతడి బ్యాగులో రూ.11.25 లక్షలు పట్టుబడ్డాయి. సరైన ఆధారాలు చూపకపోవడంతో నగదు సీజ్ చేశారు.
మలబార్ గోల్డ్ సంస్థ నిర్వాహకులు బంగారం తరలిస్తుండగా దూలపల్లిలో పేట్ బషీరాబాద్ పోలీసుల తనిఖీల్లో పట్టుకున్నారు. 54 లక్షల విలువ చేసే 15 కేజీల బంగారం, 11 కేజీల వెండి, 120 గ్రాముల డైమండ్స్కు సంబంధించిన పత్రాలను పరిశీలించిన అధికారులు అనంతరం తిరిగి మలబార్ నిర్వాహకులకు అప్పగించారు.
కొత్తపేటలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న చైతన్యపురి పోలీసులకు ఒక వ్యక్తి రూ. 97,16,865 నగదుతో వెళ్తూ పట్టుబడ్డాడు. కద్రిక రాజేశ్ బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో క్యాష్ కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. కొత్తపేటలోని ఓమిని దవాఖాన వద్ద తనిఖీలు చేస్తుండగా భారీ నగదుతో పట్టుబడ్డాడని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.
కాటేదాన్కు చెందిన బి. మహేందర్ కారులో రూ.19.88 లక్షలు తరలిస్తుండగా.. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించిన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘట్కేసర్ రూరల్: ఘట్కేసర్ పరిధిలోని కేపాల్ చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నగరం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ట్రక్కులో సరైనా ఆధారాలు లేకుండా తరలిస్తున్న 615 చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.