మేడ్చల్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 45 కోట్లకు పైగా విలువజేసే ఆభరణాలు, నగదు పట్టుబడింది. తనిఖీల్లో సీజ్ చేసిన నగదు, ఆభరణాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించి.. తిరిగి తీసుకునేందుకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముమ్మరంగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, ఆభరణాలు, మద్యం తరలించకుండా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.
ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో రూ. 45.25 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 16.73 కోట్ల నగదు కాగా.. రూ. 28.51కోట్ల విలువైన బంగారు, వెండి, ఇతర అభరణాలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. దీంతో పాటు ఆబ్కారీ శాఖకు సంబంధించి 1,503 లీటర్ల మద్యం పట్టుకుని, 298 కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో 200 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.
గ్రీవెన్స్ కమిటీని సంప్రదించాలి
తనిఖీల్లో సీజ్ చేసిన నగదు, ఆభరణాలను తీసుకునేందుకు రశీదులు, సాక్ష్యాలతో గ్రీవెన్ కమిటీని సప్రందించాలి. సీజ్ చేసిన నగదు, ఆభరణాల అంశాన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ఫిర్యాదుల కమిటీ పరిశీలిస్తుంది. కమిటీలో కమిటీ కన్వీనర్గా జిల్లా సహకార అధికారి శ్రీనివాసమూర్తి, సభ్యులుగా డీటీవో నర్సింహా రావు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి పద్మజారాణిని నియమించాం. సరైన ఆధారాలు చూపిస్తే నగదు, ఆభరణాలు తిరిగి ఇస్తారు.
అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, వివాహం.. ఇతర అవసరాలకు తీసుకువెళ్లే నగదు, ఆభరణాలకు సంబంధించిన పత్రాలు వెంట ఉండాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లరాదు. సీజ్ చేసిన నగదు, నగలు విడుదలకు గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ శ్రీనివాసమూర్తి(9100115724), నర్సింహా రావు(7799934204), పద్మజారాణి (7330999280)ని సంప్రదించాలి.. అని కలెక్టర్ సూచించారు.