సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు మహానగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈసారి వినాయక నిమజ్జనం, ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగ ఒకేరోజు వచ్చే అవకాశం ఉండటంతో శాంతి భద్రతలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలతో సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసే ప్రతి మండపంపై ప్రత్యేక నిఘా పెట్టేలా చర్యలు తీసుకున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దీ అధికంగా ఉండే ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ మండపాలతో పాటు పాతబస్తీ, బేగంబజార్ తదితర సున్నిత ప్రాంతాల్లోని మండపాల వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి గణేశ్ మండపంలో బుక్ పాయింట్ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు బీట్ పోలీసులు గణేశ్ మండపంలోని బుక్పాయింట్లో సంతకం చేయాలని, మండపాల వద్ద ఏవైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాత్రి 10గంటల తరువాత సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్లు పెట్టవద్దని, మండపాలలో పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.