మీర్పేట, ఫిబ్రవరి 7 : ఉద్దెమర్రి వైన్స్ వద్ద జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నేరం చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ సందీప్ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన నిందితులు మూడుచింతలపల్లి మండలంలో జేసీబీ డ్రైవర్లుగా, కూలీ పని చేస్తున్నారు. పనులు చేయగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఒక ముఠాగా ఏర్పడి దోపిడీలకు పథకం వేశారు. ఇందుకు రాజస్థాన్ నుంచి నాటు తుపాకీని కొనుగోలు చేశారు. తుర్కపల్లి వద్ద పల్సర్ బైక్ను చోరీ చేసి, గత నెల 23వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఉద్దెమర్రి వినాయక వైన్స్ సిబ్బంది పై కాల్పులు జరిపి, దాడులకు పాల్పడ్డారు. వైన్స్ షాపు సిబ్బంది నుంచి రూ.2,08,500 నగదును దోచుకొని పారిపోయారు.
బాధితుల ఫిర్యాదు మేరకు శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనను సీరియస్గా తీసుకున్న మేడ్చల్ డీసీపీ సందీప్ వెంటనే 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిందితులు పారిపోయిన మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులు వాడిన నాటు తుపాకీ ఆధారంగా రాజస్థాన్ ముఠానే ఈ పని చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. కొన్ని బృందాలను రాజస్థాన్కు పంపించారు. అక్కడ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాసిర్ను షికారి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా మిగతా నిందితులు సమూన్ అలియాస్ మహమ్మద్ సమున్ఖాన్, తారిక్ మహ్మద్ తారీఫ్ల ఆచూకీ తెలిసింది.దీంతో వారిని అల్వాల్లో పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న నాటు తుపాకి, పల్సర్ బైక్, రూ.30 వేల నగదు, బుల్లెట్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆరీఫ్ఖాన్ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీలు రామలింగరాజు, శశాంక్రెడ్డి, సీఐలు జేమ్స్బాబు, బాల్రాజ్, లక్ష్మీనారాయణరెడ్డి, సుధీర్కుమార్, ఎస్ఐలు రవికుమార్, వీరశేఖర్, 8 బృందాల సభ్యులు పాల్గొన్నారు.