మెహిదీపట్నం/కార్వాన్, ఏప్రిల్ 10 : యువకుడిని రాజీకోసం పిలిచి తుపాకీతో కాల్చి, కత్తులతో పొడిచి చంపిన ఘటనలో ఐదుగురిని టప్పాచబుత్ర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం మెహిదీపట్నంలోని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కిరణ్ఖరె, గోషామహల్ ఏసీపీ సతీశ్, టప్పాచబుత్ర ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావులతో కలిసి వివరాలు వెల్లడించారు. కార్వాన్ హరిదాస్నగర్లో నివాసముండే ఠాకూర్ అకాశ్సింగ్ అలియాస్ చోటు(26)కు ఉప్పర్బస్తీ న్యూసత్యనారాయణనగర్లో నివాసముండే అంబటి క్రాంతి సాగర్(45), అతడి స్నేహితులకు గత సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపులో గొడవ జరిగింది. ఈ క్రమంలో క్రాంతిసాగర్, రవికాంత్, సందీప్లకు గాయాలయ్యాయి. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేసి అకాశ్సింగ్, అతడి సోదరుడు రాహుల్ను జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చాక ఆకాశ్సింగ్ను రాజీకుదుర్చుకుందామని క్రాంతిసాగర్ కోరాడు.
అందుకు ఆకాశ్సింగ్ ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని పథకం పన్నాడు. క్రాంతిసాగర్ తన స్నేహితులు ముత్రాక్చంద్ర(29), ఇమ్రాన్ ఖాన్(37), బోడి అరవింద్యాదవ్(41), చెట్టుపల్లి శైలేష్(36) సహకారం కోరాడు. 2022 నవంబర్లో బీహార్కు వెళ్లి రూ.79వేలకు తుపాకీ, 13 రౌండ్ల బులెట్లు తీసుకువచ్చారు. ఏప్రిల్ 4న కార్వాన్ తోఫ్ఖానా ప్రాంతంలోని తాలిమ్ సెంటర్కు రావాలని ఇమ్రాన్ ద్వారా ఆకాశ్సింగ్ను పిలిపించాడు. మాట్లాడుకుందామని ఆకాశ్సింగ్ను సెంటర్లోకి తీసుకువెళ్లిన క్రాంతిసాగర్ తుపాకీతో కాల్చి, కత్తితో నరికి చంపాడు. అనంతరం చంద్ర, ఇమ్రాన్లతో కలిసి పారిపోయినట్లు తెలిపారు. సోమవారం కార్వాన్లో నిందితులు చంద్ర, ఇమ్రాన్, అరవింద్, శైలేశ్లను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి హత్యకు ఉపయోగించిన తుపాకీ, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.