రియల్ వ్యాపారులతో కుమ్మక్కు
ఫోర్జరీ ఆధార్ కార్డులతో జిమ్మిక్కు
రూ.20 కోట్లు విలువైన స్థలాల పత్రాలు స్వాధీనం
9 మందిని అరెస్టు చేసిన రాచకొండ ఎస్వోటీ
ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ఖాళీ స్థలాలు కనిపిస్తే వాటికి నకిలీత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠాను రాచకొండ మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన రూ.20 కోట్లు విలువ చేసే స్థలాల నకిలీపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లిలో ఓ స్థలానికి సంబంధించి పత్రాలు సృష్టించి రూ.8 లక్షలకు అగ్రిమెంట్ చేశారు. దీని గురించి ఆరాతీయగా 9 మంది సభ్యుల ముఠా గుట్టు రట్టయ్యింది. దీనికి సంబంధించి నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్లో కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చర్లపల్లికి చెందిన కుమారస్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారి. సర్వే నం. 216,217, 218, 219, 220, 221, 222లోని 149వ ప్లాట్ (266 గజాలు) ఖాళీగా ఉందని గుర్తించాడు. సర్టిఫైడ్ డాక్యుమెంట్ తీసి నకిలీపత్రాలు సృష్టించాలని మలక్పేటకు చెందిన మరో రియల్ వ్యాపారి బొమ్మ రామారావుకు తెలిపాడు.
రామారావు తన స్నేహితుడు దయాకర్తో కలిసి ఈ స్థలంపై డాక్యుమెంట్ నం.4281/1985తో పత్రాలు తయారు చేసి ప్రభుత్వశాఖల ముద్రలు వేశాడు. రూ.లక్ష తీసుకొని ఆ పత్రాలను కుమారస్వామికి ఇవ్వగా, వాటిని అంబర్పేటలో ఉంటున్న మరో రియల్ వ్యాపారి బొడ్డు శ్రీనివాస్కు ఇచ్చి భూ యజమానిగా సరిపోయే వ్యక్తిని నియమించాలన్నాడు. ఇందుకు వచ్చిన లాభంలో 50 శాతం ఇస్తానని చెప్పాడు. బొడ్డు శ్రీనివాస్ తన స్నేహితులైన రియల్ వ్యాపారులు రాజశేఖర్, జానయ్య, బాలరాజ్లతో కలిసి గడ్డం శ్యాంరావు(75) యజమానిగా ఉండాలని కోరారు. దీనికిగాను లక్ష రూపాయలు ఆశచూపి ఆధార్ నెంబరు, ఫొటోతో గడ్డం శ్యాంరావు బదులు స్థల యజమాని గురజాడ కొండల్రావు పేరుతో నకిలీ ఆధార్కార్డు రూపొందించారు. అతని కుమారుడిగా బొడ్డు శ్రీనివాస్ తన ఆధార్ నంబరు, ఫొటోతో గురజాడ శ్రీనివాస్గా ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసుకున్నాడు. ఇలా నకిలీ పత్రాలు సృష్టించిన బొడ్డు శ్రీనివాస్ కుషాయిగూడకు చెందిన యాదగిరికి ఈ స్థలాన్ని రూ.47.99 లక్షలకు విక్రయించినట్లు ఒప్పందం చేసుకొని రూ.8 లక్షలు అడ్వాన్సు తీసుకున్నాడు.
నకిలీవని తేలడంతో..
ఈ అగ్రిమెంట్ పత్రాలు తీసుకొని యాదగిరి రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు పలువురిని ఆరాతీయగా నకిలీవని తేలడంతో వెంటనే రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. ఉన్నతాధికారులు ఆదేశాలతో మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం దర్యాప్తు చేసి నకిలీపత్రాలు సృష్టిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. విచారణలో బొమ్మ రామారావు తన ముఠాతో కలిసి బంజారాహిల్స్-2, కొండాపూర్-1, మాదాపూర్ అయ్యప్పసొసైటీ-1, ఆర్సీపురం-2, మలక్పేట సలీంనగర్-1, తుర్కయంజాల్-1 చొప్పున ఖరీదైన ప్లాట్లకు నకిలీపత్రాలు సృష్టించినట్లు తేలింది. ఈ స్థలాల మార్కెట్ విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. బొమ్మ రామారావు, బొడ్డు శ్రీనివాస్, గడ్డం శ్యాంరావు, కుమారస్వామి, గంట రాజశేఖర్, మెరుగు జానయ్య, అవుల బాలరాజు, వల్లపు కృష్ణ, నౌసు శ్రీధర్లను అరెస్టు చేశారు. వీరినుంచి రూ.10.4 లక్షల నగదు, 38 రబ్బరు స్టాంపులు, 423 బాండు పేపర్లు, 1272 స్టాంపు పేపర్లు, 20 ఆధార్కార్డులు, 8 డ్రైవింగ్ లైసెన్స్లు, 32 ఓటరు ఐడీ కార్డులు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు దయాకర్, హఫీజ్లు పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో ఎస్వోటీ డీసీపీ మురళీధర్, మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం, కుషాయిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి పాల్గొన్నారు.
32 ఎకరాల లేవుట్లో రెండు ప్లాట్లు మిగిలాయి…
బొమ్మ రామారావును విచారించగా మరో నకిలీపత్రాల బాగోతం బయటపడింది. నాదర్గుల్ ప్రాంతానికి చెందిన సర్వే నం.574, 575, 576, 580, 581, 585లలో 32 ఎకరాలు ఉన్నాయి. వీటిని స్థల యజమానులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి విక్రయించగా, అతను ప్లాట్లు చేసి అమ్మేశాడు. 32 ఎకరాల స్థల యజమానుల్లో ఒకరైనా కృష్ణ అందులో 199, 79 రెండు ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించాడు. వాటికి నకిలీపత్రాలు సృష్టించి అమ్మాలని పథకం వేసి స్నేహితులైన నౌసు శ్రీధర్, రామారావుతో కలిసి నకిలీపత్రాలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు.