అబిడ్స్ పీఎస్లో ఫిర్యాదు చేసిన పలు సంఘాల ప్రతినిధులు
అబిడ్స్, జూన్ 8: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయాలంటూ అబిడ్స్ పోలీసులకు బుధవారం పలువురు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఘటనలో మైనర్ వీడియోలను మీడియా ముందు బహిర్గతం చేసిన రఘునందన్రావుపై పోక్సో కేసు నమోదు చేయాలంటూ పీవోడబ్ల్యూ సంధ్య బుధవారం మహిళా సంఘాలతో వచ్చి అబిడ్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణ ఉమెన్, ట్రాన్స్జెండర్స్ ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు కూడా రఘునందన్రావుపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ సంధ్య మీడియాతో మాట్లాడుతూ.. మైనర్ వీడియోలను బహిర్గతం చేసిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సెక్షన్ 23 పోక్సో 2012 యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి మైనర్పై అఘాయిత్యం జరిగితే ఖండించేది పోయి.. ఆ వీడియోలను బహిర్గతం చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు.