సికింద్రాబాద్, సెప్టెంబర్ 16: పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీచేసి పెట్రోలు ఉన్నంత వరకు షికారు చేసి, ఆ తర్వాత మరో బైక్ను చోరీ చేస్తున్న నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ నరేశ్, డీఐ నాగేశ్వరరావు, డీఎస్ఐ సాయికృష్ణ, అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. రాంనగర్ గుండు ప్రాంతానికి చెందిన తుమ్మ ఆదిత్య అలియాస్ నాని(24) ఫొటోగ్రాఫర్. తండ్రి పందేండ్ల కిందట మరణించాడు. బాబాయ్ వద్ద ఫొటో గ్రాఫర్గా పనిచేశారు. బాబాయ్ కూడా జనవరిలో మరణించాడు. ఆ తర్వాత కొంత కాలం ఓ ఫొటో స్టూడియోలో పని చేశాడు. జీతం డబ్బులు రావడంలేదు. దీంతో కుటుంబ సభ్యులతో గొడవపడి కొంతకాలం సూరారంలోని ఓ హాస్టల్లో ఉన్నాడు. బైక్లపై సరదాగా షికార్లు చేయడం ఇష్టపడే ఆదిత్య.. సొంత వాహనం లేకపోవడం ఆరు నెలల కిందట మాస్టర్ కీని వినియోగించి పార్కింగ్ చేసిన వాహనాన్ని చోరీ చేశాడు. ఆ వాహనంపై పెట్రోల్ ఉనంత వరకు సరదాగా చక్కర్లు కొట్టి.. పెట్రోల్ అయిన తర్వాత ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి మరో బైక్ను చోరీ చేశాడు. ఇలా దొంగగా మారాడు. ఇదిలా ఉండగా..తార్నాకకు చెందిన షేక్ అబ్దుల్ కలీం ఈనెల 12న వాషింగ్ కోసం జామై ఉస్మానియా వద్ద గల సర్వీసింగ్ సెంటర్కు వచ్చి తన వాహనాన్ని పార్కింగ్ చేశాడు. కొంత సమయం తర్వాత చూడగా వాహనం కనిపించలేదు.
పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం ఉదయం పార్శిగుట్ట చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చేసిన బైక్ చోరీల చిట్టా విప్పాడు. బైక్లపై తిరిగే సరదా తీర్చుకోవడం కోసం చోరీ చేస్తున్నట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చిలకలగూడ, సైఫాబాద్, బాచుపల్లి, మాదాపూర్, జీడిమెట్ల పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీ చేసిన హోండాషైన్ , హోండాలివో , సీబీజెడ్ ఎక్స్ట్రీమ్ , ఫ్యాషన్ప్రో, టీవీఎస్ అపాచీ, బజాజ్పల్సర్ , హోండా డియో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుంది. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. చిలకలగూడ సీఐ నరేశ్, డీఐ నాగేశ్వరరావు, డీఎస్ఐ సాయికృష్ణ, క్రైం సిబ్బంది భాషా, ప్రవీణ్, రమేశ్, గణేశ్, విజయ్లను నార్త్జోన్ డీసీపీ చందనా దీప్తి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, గోపాలపురం ఏసీపీ సుధీర్ అభినందించి, రివార్డులు అందజేశారు.