హయత్నగర్, డిసెంబర్ 4 : రేవ్పార్టీలో పాల్గొన్న 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, బైక్, 30 సెల్ఫోన్లు, 8 సిగరేట్లు, డీజే సౌండ్ సిస్టమ్, ఖాళీ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. 31 మందికి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాములలో ఉన్న ఓ ఫామ్ హౌజ్లో శుక్రవారం అర్ధరాత్రి పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. దీంతో పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఆ ఫామ్హౌజ్పై దాడిచేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఫామ్హౌజ్లోకి వెళ్లి చూడగా.. సిగరెట్లలో గంజాయిని పెట్టుకుని ముగ్గురు విద్యార్థులు తాగుతూ పట్టుబడ్డారు. డీజే సౌండ్తో డ్యాన్సులు చేస్తున్న నలుగురు అమ్మాయిలు, మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయిని ఫామ్హౌజ్లోపలికి తీసుకొచ్చేలా అనుమతి ఇచ్చిన యజమాని సన్నీ కిరణ్పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించిన పోలీసులు.. పరారీలో ఉన్న సనీత్చారి, రోహిత్, యజమాని సన్నీ కిరణ్ కోసం గాలిస్తున్నారు. మిగతా వారందరికీ హయత్నగర్ మండల తాసీల్దార్ సంధ్యారాణి, పోలీసు అధికారులు కౌన్సెలింగ్ చేసి, పంపించారు.