సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విక్రయిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3.92లక్షల విలువైన 13 గ్రాముల కొకైన్, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… టోలీచౌకికి చెందిన మహ్మద్ అష్రఫ్ బేగ్ అరబిక్ ట్యూటర్. నైజీరియన్ దేశానికి చెందిన జుదె అలియాస్ క్రిస్తో పరిచయం ఏర్పడింది.
క్రిస్ గోవా కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. మహ్మద్ అష్రఫ్ తరచూ గోవాకు వెళ్లి అతడి నుంచి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి..నగరంలో విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో 2021లో రాయదుర్గం పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. ఈ ఏడాది జూన్లో జైలు నుంచి విడుదలైన తరువాత తిరిగి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. నిందితుడిపై నిఘా పెట్టిన మాదాపూర్ ఎస్వోటీ, స్థానిక పోలీసులు ఈనెల 25న ఇక్రిసాట్ వద్ద మహ్మద్ అష్రఫ్ను డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.