హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ వ్యాప్తంగా రంగు రంగుల పతంగులను ఎగురవేస్తారు. అయితే శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, ప్రధాన కూడళ్లు, ప్రార్థనాస్థలాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయడాన్ని నిషేధించారు. ఈ నిషేధం జనవరి 14న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక బహిరంగ ప్రదేశాల్లో డీజే సౌండ్లు పెట్టరాదని ఆదేశించారు. వాణిజ్య ప్రాంతాల్లో 65 డెసిబుల్స్, రాత్రి సమయాల్లో 55 డెసిబుల్స్, నివాస ప్రాంతాల్లో 55 డెసిబుల్స్కు ధ్వని తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నివాస సముదాయాలపైకి, బాల్కనీల్లోకి పిల్లలను అనుమతించకూడదు. గోడలపై నిల్చుని పతంగులు ఎగురవేయొద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద చిక్కుకుపోయిన గాలిపటాలను సేకరించే ప్రయత్నం చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పారు.