Bachupally | జీడిమెట్ల, జూన్ 6 : హైదరాబాద్ బాచుపల్లి సమీపంలో ట్రావెల్ బ్యాగులో మృతదేహం కనిపించిన కేసును పోలీసులు చేధించారు. నేపాల్కు చెందిన మహిళను తీసుకొచ్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. షాపూర్ నగర్లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ కె.సురేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. నేపాల్ దేశానికి చెందిన విజయ్ తోఫా(26) బౌరంపేటలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి నేపాల్కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి తారాబెహరా(33)తో కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం ఆమెను నేపాల్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చాడు. హైదరాబాద్కు తీసుకొచ్చాక ఆమె గర్భవతి కావడంతో విజయ్, తారాబెహరా మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని దారుణంగా హత్య చేశాడు. తారాబెహరా మెడకు విజయ్ తోఫా చున్నీ చుట్టి మే 23వ తేదీన హత్య చేసి మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో ఉంచి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి ల్యాబ్స్ పక్కన పడేసి వెళ్లాడు. అయితే ట్రావెల్ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ట్రావెల్ బ్యాగ్ను తెరిచి చూడగా.. అందులో కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించడం కలకలం రేపింది. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పట్టుకుని విచారించగా, చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.