మన్సూరాబాద్, నవంబర్ 7: కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుడి నుంచి రూ. 25 లక్షల విలువజేసే 87.6 కేజీల గంజాయి, కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి. సాయిశ్రీ వివరాలను వెల్లడించారు. పూణెకు చెందిన రాజు, అతుల్ సావతా గైక్వాడ్ (34), సన్యాసిరావు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి కొనుగోలు చేసి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 5న విశాఖపట్నం నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో 52 ప్యాకెట్లలో 87.6 కేజీల గంజాయి నింపుకొని అతుల్ సావతా గైక్వాడ్ బయలుదేరాడు. కారులో గంజాయి రవాణా జరగుతున్న సమాచారం అందుకున్న హయత్నగర్ పోలీసులు పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్పై సోమవారం మధ్యాహ్నం వాహనాల తనిఖీ చేపట్టారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న కారును పోలీసులు సీజ్ చేసి, నిందితుడు అతుల్ సావత్ గైక్వాడ్ను రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు రాజు, సన్యాసిరావు పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ ఎస్. భీంరెడ్డి, హయత్నగర్ ఇన్స్పెక్టర్ హెచ్. వెంకటేశ్వర్లు, డీఐ ఆర్. నిరంజన్ పాల్గొన్నారు.