పట్టుబడిన రోహింగ్యాలు
చార్మినార్, జూన్ 2 : అక్రమంగా ధ్రువీకరణపత్రాలు పొంది.. దేశపౌరులుగా చలామణి అవుతున్న ఇద్దరు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మహ్మద్ హుస్సేన్ అలీ (38), షేక్ కమాల్ (35) దేశంలోకి శరణార్థులుగా వచ్చి శాలిబండ సయ్యద్ అలీ ఛబుత్రా ప్రాంతంలో స్థిరపడ్డారు.
స్థానికతను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ అక్రమంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్కార్డులు, గ్యాస్ కనెక్షన్, పాన్కార్డు, కోటక్ బ్యాంక్ అకౌంట్తో పాటు చెక్బుక్లను సంపాదించారు. దేశ పౌరులుగా చలామణి అవుతూ పాస్పోర్టు, మ్యారేజ్ సర్టిఫికెట్లను సైతం తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుల ఇండ్లపై దాడులు నిర్వహించి.. ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం వారిని సంతోష్నగర్ పోలీసులకు అప్పగించగా, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.