బాధితుల ఫిర్యాదు.. నిందితుడు అరెస్ట్
సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): టాస్క్ఫోర్స్ పోలీసునని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధకిషన్రావు కథనం ప్రకారం.. జనగాం జిల్లాకు చెందిన సృజన్కుమార్ అలియాస్ సూర్య పాత నేరస్తుడు. అతడిపై తెలంగాణలో 14, ఏపీలో 4 దొంగతనం కేసులు ఉన్నాయి. కాగా గత ఫిబ్రవరి 7న నెక్లెస్ రోడ్డులోని బతుకమ్మ ఘాట్ వద్ద కారులో కూర్చొని ఉన్న ఒక జంట వద్దకు యాక్టివా వాహనంపై వెళ్లిన సూర్య తాను టాస్క్ఫోర్స్ అఫీసర్నంటూ పరిచయం చేసుకొని ఐడీ కార్డును కూడా చూపించాడు. మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు.. నాకు డబ్బులు ఇవ్వకపోతే మీపై కేసు నమోదు చేస్తా.. అంటూ బెదిరించాడు. వారిద్దరిని బంజారాహిల్స్ రోడ్డు నం.1లోని కలామ్ వాచ్ దుకాణానికి తీసుకెళ్లి ‘బిఫిట్ లింక్-బీకే’ వాచ్ను కొనుగోలు చేయించుకున్నాడు.
వాచ్కు సంబంధించిన రూ.5800 బిల్లును బాధితుడితో ఫోన్ పే ద్వారా చెల్లించాడు. తిరిగి నెక్లెస్ రోడ్డుకు వచ్చారు. బాధితులిద్దరిని అక్కడే ఉండాలంటూ చెప్పి పరారయ్యాడు. జరిగిన సంఘటనపై బాధితులు రాంగోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ బృందానికి సూర్య చిక్కడంతో విచారించారు. గతంలో మహంకాళి పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో సూర్యపై వారెంట్ పెండింగ్లో ఉన్నట్లు బయటపడింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి వాచ్, హోండా యాక్టివా, 2.77 తులాల బంగారం, అపిల్ ఫోన్లు, నకిలీ పోలీస్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. విచారణకు రాంగోపాల్పేట్ పోలీసులకు అప్పగించారు.