సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1వ తేదీన మహదేవ్ నగల దుకాణంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నగల దుకాణం నుంచి మొదలు.. నిందితులు పారిపోయిన అన్ని మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ప్రతి చిన్న ఆధారాన్ని భూతద్దంలో పెట్టి చూశారు.
ఈ క్రమంలోనే పోలీసులకు ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించిన సమాచారం లభించినట్లు తెలిసింది. ఆ వాహనం ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం బయటపడింది. అతడు ఇచ్చిన సమాచారంతో నేరగాళ్లకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిచ్చిన సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు కొన్ని హర్యానా, మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్కు వెళ్లాయి. హర్యానాలో ఇద్దరిని, మహారాష్ట్రలో ఒకరిని ప్రత్యేక పోలీసు బృందాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో పురోగతి ఉంది.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. నిందితుల కోసం గాలిస్తున్నాం.. ఒకటి రెండు రోజుల్లో మిస్టరీ వీడే అవకాశం ఉన్నదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.