పహాడీషరీఫ్, నవంబర్ 21: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఒక వైపు పర్యావరణానికి, మరో వైపు ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ను పూర్తిగా ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వ నిషేధం ఉన్నా.. మున్సిపల్ అధికారులు ఆ దిశగా పట్టించుకోకపోవడంతో జల్పల్లి, శ్రీరామకాలనీ ఫ్యాక్టరీల్లో గుట్టుచప్పుడు కాకుండా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను తయారీ చేస్తున్నారు. వ్యాపారులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.
విచ్చలవిడిగా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్ల వాడకం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట, షాహిన్నగర్, పహాడీషరీఫ్, ఉస్మాన్నగర్, ఎర్రకుంట, జల్పల్లి, శ్రీరామకాలనీ, రాయల్కాలనీ ఇలా అనేక ప్రాంతాల్లో వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ పాలిథిన్ కవర్లను విక్రయిస్తున్నారు. వినియోగదారులకు అందజేస్తున్నారు. గతంలో ఒకటి, రెండు సార్లు ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వ్యాపార సంస్థలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి జరిమానా విధించారు. అప్పట్లో కొంత తగ్గుముఖం పట్టినా.. ఆ తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో తిరిగి తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది.
వినియోగంపై అధికారులు చర్యలు తీసుకోవాలి
ప్లాస్టిక్ కవర్లపై నిషేధం ఉన్నా కూడా తక్కువ మందం తయారీ చేసే ప్లాస్టిక్ కంపెనీలపై, వ్యాపార సంస్థలపై జల్పల్లి మున్సిపాలిటీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడ చూసినా తక్కువ మందం గల పాలిథిన్ కవర్లు దర్శనమిస్తున్నాయి. నార సంచులు, పేపర్ బ్యాగులు వంటివి భూమిలో సునాయసంగా కరిగిపోతాయి. ప్లాస్టిక్ కరిగిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. పర్యావరణానికి హాని కలుగుతుంది. అధికారులు ప్లాస్టిక్ వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– యంజాల అర్జున్, జల్పల్లి
తయారు చేసే కంపెనీలపై చర్యలు తీసుకుంటాం
120 మైక్రాన్ల లోపు పాలిథిన్ కవర్లను ప్రభుత్వం నిషేధించింది. ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారైనా సరే కంపెనీలను సీజ్ చేస్తాం. ఒకవేళ వ్యాపారులు మరో చోట నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యాపారులు, వాణిజ్య వ్యాపారులు, హోటళ్లు, కిరాణా షాపు యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. వ్యాపారులు వాడితే జరిమానా విధిస్తాం. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపార సంస్థలను సీజ్ చేస్తాం.
– వసంత, కమిషనర్