మేడ్చల్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలు ఇస్తున్నది. పట్టణ, పల్లె ప్రకృతి వనాలు(పార్క్లు) ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 397 పట్టణ, పల్లె ప్రగతి వనాల్లోని పచ్చందాలను ప్రజలు అస్వాదిస్తూ సేద తీరుతున్నారు.
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో..!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 397 పట్టణ, పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. ఇందులో 13 మున్సిపాలిటీలైన మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, నాగారం, పోచారం, ఘట్కేసర్, దమ్మాయిగూడ, కొంపల్లి, దుండిగల్, నిజాంపేట్, బోడుప్పల్, జవహర్నగర్, పీర్జాదిగూడలలో 316 పట్టణ ప్రకృతి వనాలు ఉండగా జిల్లాలోని శామీర్పేట్, మూడుచింతలపల్లి, ఘట్కేసర్, మేడ్చల్, కీసర మండలాల్లోని 61 గ్రామ పంచాయతీల్లో 81 పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. మున్సిపల్, డీఆర్డీఓ, డీపీఓ, అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.
40 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా..!
హరితహారం కార్యక్రమానికి జిల్లాలోని 61 నర్సరీల్లో 15 లక్షల మొక్కలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో జామ, మామిడి, దానిమ్మ, అల్లనెరేడు, సీతాఫల్, ఉసిరి, ఈత, కజ్జూర, మల్లె, గులాబీ, మందారం, అలవేర, రావి, మర్రి, కానుగ, కరివేపాకు తదితర ఔషధ మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల నుంచే కాకుండా గ్రేటర్ పరిధి నుంచి మరో 25 లక్షల మొక్కలను జిల్లాకు అందజేయనుండగా మొత్తం 40 లక్షల మొక్కలను వచ్చే హరితహారం కార్యక్రమంలో నాటే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు.
పల్లెకు అందం వచ్చింది
పల్లె ప్రకృతి వనంతో పల్లెలకు అందం వచ్చింది. హరితహారం కార్యక్రమం ద్వారా చేపట్టిన మొక్కల పచ్చందాలతో పల్లెలు కళకళలాడుతున్నాయి. ప్రజలందరికీ చెట్లు పెంచాలన్న ఆసక్తి పెరిగింది. మొక్కల పెంపకంలో గ్రామస్తులు భాగస్వామ్యం అవుతున్నారు.
-రమేశ్, లాల్గడి మలక్పేట్
సేద తీరేందుకు సౌకర్యంగా!
పట్టణ ప్రకృతి వనాలు శివారు ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ్లలో సేద తీరేందుకు సౌకర్యంగా మారాయి. వాకింగ్, యోగా చేసుకునేందుకు నిలయంగా మారాయి.
-హరిబాబు, తూంకుంట