అంబర్పేట, డిసెంబర్ 23: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లోని రహత్నగర్లో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, బాగ్అంబర్పేట, గోల్నాక తదితర ఐదు డివిజన్లలోని బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే సగానికి పైగా పురాతన డ్రైనేజీ పైప్లైన్ పనులు ఆధునీకరించినట్లు తెలిపారు. మిగిలిన చోట త్వరలోనే మారుస్తామని చెప్పారు. నియోజకవర్గం ప్రజల అవసరాలను గుర్తించి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ పైప్లైన్లతో పాటు తాగునీటి పైప్లైన్లు, సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, వరదనీటి పైప్లైన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంకా అనేకచోట్ల పనులు చేపట్టాల్సి ఉందని, వాటిని కూడా దశలవారీగా అభివృద్ధి పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు అప్రోజ్పటేల్, అరుణ్కుమార్రెడ్డి, శివాజీయాదవ్, రమేశ్, నవీన్యాదవ్, శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే
అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక చేయూత అందిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి గోల్నాక తులసీనగర్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆపత్కాలంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.