Hyderabad | బంజారాహిల్స్, మార్చి 4 : అత్యవసర పరిస్థితిలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లమీద సైరన్ వేసుకుని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్లను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. అవసరం లేకున్నా సైరన్లు వేసుకుంటూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇలాంటి దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మంగళవారం మధ్యాహ్నం పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో వెస్ట్జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా సైరన్ వేసుకుని ఓ అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో రోగి ఉన్నాడా..? లేదా..? అని పరిశీలించేందుకు ట్రాఫిక్ పోలీసులు డోర్ తెరిచి చూడగా అవాక్కయ్యారు. అంబులెన్స్లో బోనులో ఓ పెంపుడు కుక్క కనిపించింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణను ప్రశ్నించగా తాను హిమాయత్నగర్ నుంచి పెంపుడు కుక్కను తీసుకువస్తున్నానని, మదీనగూడలోని ఐవీ హాస్పిటల్లో కుక్కకు వేసక్టమీ(కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ చేయాల్సి ఉందని చేప్పాడు.
వేసక్టమీ ఆపరేషన్ చేసేందుకు సైరన్ వేసుకుని ఎందుకు వెళ్తున్నావని ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. దీంతో అంబులెన్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని మాత్రమే అంబులెన్స్లో సైరన్ వేసుకుని తరలించాల్సి ఉంటుందని, ఖాళీగా వెళ్లే సమయంలో కూడా కొంతమంది సైరన్లు వేసుకుని వెళ్తుండడం చట్ట విరుద్దమన్నారు. పెంపుడు జంతువులను తరలించేందుకు కూడా అంబులెన్స్లు వాడడం, వైద్య పరీక్షల కోసం అంబులెన్స్ సైరన్ వేసుకుని వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.