Musi River | సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే దేశ, విదేశాల్లో పర్యటించి పలు నగరాల మధ్య ఉన్న నదుల తీరంలో చేపట్టిన ప్రాజెక్టులను అధికారులతో పాటు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించి వచ్చారు. మూడేళ్లలో మూసి సుందరీకరణ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. అలాంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన మూసీ నది తీర ప్రాంతంలో కబ్జాలు సైతం అదే స్థాయిలో శరవేగంగా కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రి మట్టి పోసి తెల్లారేసరికల్లా చదును చేస్తున్నారు. ఇంత జరిగినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాలు కాగా మిగిలిందే మూసి తీరం అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మూసీ తీరంలో 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుందని చెబుతున్న అధికారులు, దాన్ని పరిరక్షించడంలో మాత్రం విఫలమవుతున్నారు.
హైదరాబాద్ మహానగరానికి నైరుతి దిశలో ఉన్న జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ల కింద నుంచి ప్రారంభమయ్యే మూసి, ఈసీ నదుల తీర ప్రాంతం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో పట్టణీకరణతో మూసి తీరం చాలా చోట్ల కబ్జాలకు గురికాగా, ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత ఉన్న హెచ్ఎండీఏ పరిధిలోని స్థానిక మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలోని మూసీ తీరం రాత్రికి రాత్రే కబ్జా అవుతూ కుచించుకుపోతున్నది. గండిపేట నుంచి నార్సింగి, మంచిరేవుల మీదుగా బాపుఘాట్ వరకు ఉన్న ప్రాంతం ఐటీ కారిడార్కు సమీపంలో ఉండడంతో మూసీ తీరంలోనే భారీ బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయి. అదేవిధంగా హిమాయత్సాగర్ కింద ఉన్న రాజేంద్రనగర్, బుద్వేల్, కిస్మత్పూర్, అత్తాపూర్, బండ్లగూడజాగీర్ ప్రాంతాల్లోని ఈసీ నది తీరంలోనూ మట్టితో పూడుస్తూ బఫర్జోన్ను కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. లంగర్హౌస్ బాపుఘాట్ నుంచి రెండు నదుల ఒక్కటిగా మారిన తర్వాత ఉన్న మూసీ తీర ప్రాంతంలోనూ అదే స్థాయిలో మట్టిపోస్తూ చదును చేస్తూనే ఉన్నారు.
బఫర్ జోన్ను దృష్టిలో పెట్టుకొని అనుమతులు ఇవ్వాల్సిన హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మూసి, ఈసీ నదుల తీర ప్రాంతం నుంచి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల విషయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి ఎన్వోసీ పత్రం లేకున్నా భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మూసీ సుందరీకరణ కోసం ఏర్పాటైన మూసి రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)నుంచి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపించింది. తార్నాకలో ఉన్న కార్యాలయానికి మూసీ తీర ప్రాంతం దూరంగా ఉండడం, పర్యవేక్షణకు అవసరమైన యంత్రాంగం లేకపోవడంతో నిత్యం ఎక్కడో ఒక చోట మూసుకుపోతూనే ఉంది. మూసి పరీవాహక ప్రాంతం గండిపేట నుంచి తూర్పున ఉన్న కొర్రెముల దాకా సుమారు 55కి.మీ మేర అక్రమార్కులు మూసినిపూడ్చివేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.