హైదరాబాద్ : ఎన్నో సంవత్సరాలుగా వరద ముంపుకు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో గల తన కార్యాలయంలో ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట నాలా, 10 కోట్ల రూపాయల వ్యయంతో పికెట్ నాలా పై చేపట్టిన బ్రిడ్జి విస్తరణ నిర్మాణ పనులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరదనీటితో బేగంపేట నాలా పరిధిలోని బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
అందులో భాగంగా బేగంపేట నాలాకు ఇరువైపుల రిటైనింగ్ వాల్స్ నిర్మాణంతో పాటు పూడిక తొలగించే పనులు చేపట్టామన్నారు. పనులు మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్ఎన్డీపీ ఎస్ఈ భాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్,డీఈ సునీల్ తదితరులు పాల్గొన్నారు.