“ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే బీఆర్ఎస్ పార్టీ నిత్యం కృషి చేసింది. ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఆవిష్కరించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, పాలకులు ప్రజల యోగ క్షేమాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉన్నారు. అలాంటి ప్రభుత్వాలపై ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటూనే ఉంటది. అది సత్యం.”
బంజారాహిల్స్, ఆగస్టు 25: బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఉన్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన మాగంటి గోపీనాథ్కు మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ 2016లో బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి టికెట్ రావడం, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం తదితర అంశాలపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో ‘నమస్తే తెలంగాణ’ ముచ్చటించింది. తాను చెప్పిన సంగతులు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీల అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాతనే మేము టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరాం. పార్టీలో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను అత్యంత దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ప్రజల్లో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తే చాలు ఎన్నిసార్లయినా వారు ఆశీర్వదిస్తారంటూ సీఎం కేసీఆర్ గారు పలుమార్లు చెప్పారు. ఆయన సూచనలను తూచ తప్పకుండా పాటించడంతోనే మరోసారి పార్టీ టికెట్ ఇచ్చారని భావిస్తున్నాను. సీఎం కేసీఆర్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత మెజార్టీతో గెలిచి చూపిస్తాను.
1983లో తెలుగు యువత కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేను అనేక ప్రభుత్వాలను చూశాను. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఏదయినా అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలంటే ఎన్నో ఏళ్ల పాటు సాధ్యపడేది కాదు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారం కోసం గత తొమ్మిదేళ్లలో సుమారు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశాం. మా నియోజకవర్గంలో సుమారు రూ.18 కోట్ల వ్యయంతో నాలుగు చోట్ల మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. అనేక రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండేవి. వాటిని పరిష్కరించేందుకు కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ చేపట్టాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే పనిచేసే పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మా నియోజకవర్గంలో అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందిన వారు నివాసం ఉంటారు. వారందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంది. ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా, కేసీఆర్ కిట్స్ లాంటి పథకాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అందుకున్న వారే ఉన్నారు. వారంతా మరోసారి బీఆర్ఎస్ పార్టీకే మద్దతు పలుకుతామని బాహాటంగానే చెబుతున్నారు. విద్యావంతులు, వ్యాపారులు. ఇతర వృత్తుల్లో ఉన్నవారికి 24 గంటల కరెంట్ సరఫరా, హైదరాబాద్లో పెరిగిన ఉపాధి అవకాశాలు, ట్రాఫిక్ సమస్యలు లేని రోడ్లు తదితర అంశాలు ఆకట్టుకున్నాయి. వారంతా మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తామని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇతర పార్టీల నాయకులు ప్రజలకు దూరమయ్యారు. ఎలాంటి కష్టమొచ్చినా మేమున్నామంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలిచారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు ఇండ్లలో ఉన్నప్పడు కూడా ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల ఆకలి తీర్చారు. అలాంటి కష్ట సమయాల్లో మేమంతా ప్రాణాలకు తెగించి ప్రజలను ఆదుకున్నాం. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వచ్చే ప్రతిపక్ష నాయకులను నమ్మే పరిస్థితి లేదు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం.
కార్మికనగర్లో రోడ్డుకు ఇరువైపులా ఉండే 320 మంది గుడిసెవాసులను తరలించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చాం. ఈ రోడ్డును విస్తరించడంతో పాటు సుందరీకరణ చేశాం. ఎర్రగడ్డ డివిజన్ ఎన్ఆర్ఆర్ పురం కాలనీకి 40 ఏళ్లుగా ఉన్న థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాం. వెంగళరావునగర్లో థీమ్ పార్కు, రహ్మత్నగర్లో తొమ్మిదెకరాల్లో భారీ ప్లే గ్రౌండ్, 2 ఎకరాల్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకుంటున్నాం. కమలానగర్ మురికివాడను తొలగించి సకల సదుపాయాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి గుడిసెవాసులకు అందించాం. ఎర్రగడ్డ చాతి ఆస్పత్రి ఆవరణలో 2వేల పడకల మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోంది. షేక్పేట డివిజన్ పరిధిలో వరదనీరు, మురుగు సమస్యలు తొలగించేందుకు సుమారు రూ.200 కోట్లతో పనులు చేపట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం.