సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ) : దళితులు.. యాదవులు.. విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, రజకులు, ముస్లింలు, మహిళా సంఘాలు, కాలనీ సంఘాలు.. ఇలా ఒక్క కులమని లేదు..మతమని లేదు.. సబ్బండ వర్ణాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. పదేండ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేరాఫ్గా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అండగా ఉంటామని తేల్చి చెబుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జనం నీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రలు, ర్యాలీలు, లబ్ధిదారులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో సమగ్రాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, మా మద్దతు మీకేనంటూ ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముక్తకంఠంతో చెబుతున్నారు. పార్టీ వెంటే ఉంటామని, మా సీఎం కేసీఆరేనని, మా ఎమ్మెల్యే మీరేనంటూ నినదిస్తున్నారు. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు బోరబండ డివిజన్లోని ఎన్ఎన్ఆర్పురం హౌసింగ్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎన్నోఏండ్లుగా క్రమబద్ధీకరణకు నోచుకోని అంశాన్ని జీవో.96ని తీసుకువచ్చి ఇండ్లను క్రమబద్ధీకరించాలని, గత ప్రభుత్వాలు పట్టించుకోని సమస్యను పరిష్కరించారని పేర్కొంటూ సొసైటీ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్కే మద్దతు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఇదే నియోజకవర్గంలో రహ్మత్నగర్ హబీబ్నగర్ ఫేజ్-1, 2, వినాయక్నగర్లో ప్లే గ్రౌండ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించినందుకు కృతజ్ఞతగా మద్దతు ప్రకటించారు. సనత్నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసిన జెక్ కాలనీ వాసులు, ఇతర డివిజన్ల నుంచి పెద్దఎత్తున వచ్చి మద్దతును ప్రకటించారు. ఆదివారం మంత్రి మల్లారెడ్డికే మా ఓటు అంటూ నాగారం మున్సిపాలిటీ రాంపల్లి 4వ వార్డులో ఏకగ్రీవ తీర్మానాలు చేసి మంత్రికి అందజేశారు. కుత్బుల్లాపూల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానందకు మద్దతుగా గణేశ్నగర్, దత్తాత్రేయనగర్, యాదిరెడ్డి బండ, రంగారెడ్డి బండ, మధుసూదన్రెడ్డినగర్, శ్రీనివాస్ నగర్ కాలనీ, బాలయ్యనగర్ కాలనీ వాసులు మద్దతు తెలిపారు. ఇతర ఎమ్మెల్యేలకు సైతం ఇదే రీతిలో మద్దతు లభిస్తున్నది.
అడుగడుగునా బ్రహ్మరథం..
ఎన్నికల ప్రచారంలో దూసువెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. పాదయాత్ర, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా ఎమ్మెల్యేలకు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ.. సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్యలకు తక్షణ పరిష్కారంతోపాటు అపరిష్కృత సమస్యలను కొలిక్కి తీసుకువస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచార పర్వం సాగుతుండటంతో ఎమ్మెల్యేలకు మద్దతుగా కాలనీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు బ్రహ్మరథం పడుతున్నారు.