మేడ్చల్ కలెక్టరేట్/మేడ్చల్, జనవరి 13: సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మేడ్చల్, శామీర్పేట, కీసర సీఐలు రాజశేఖర్ రెడ్డి, సుధీర్ కుమార్, రఘువీరారెడ్డి శుక్రవారం తమ పరిధిలోని పలు బస్తీలో అవగాహన సదస్సులు నిర్వహించారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీ 17వ వార్డు సత్యనారాయణ కాలనీలో కీసర సీఐ రఘువీరారెడ్డి ప్రజలకు దొంగతనాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. పండుగకు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో పలు కాలనీలు, బస్తీల్లోని ఇళ్లకు తాళాలు వేస్తారని, దీనిని అసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అందుకోసం దీనిపై కాలనీల్లో గస్తీని పెంచి, రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేస్తున్నామని, ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఊరికి వెళ్లే ముందు ఇంట్లోని డబ్బు, బంగారం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని, ఇంటికి తాళం వేసిన తరువాత తాళం కనిపించకుండా డోర్ కర్టెన్లను వేయాలని, గేటుకు తాళం లోపలివైపు నుండి వేసి జాగ్రత్త వహించాలని చెప్పారు. ఇంట్లో పగలు, రాత్రి చిన్న విద్యుత్ బల్బు వెలిగేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లు, పరిసరాలు, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐలు జగన్ రెడ్డి, రాజశేఖర్, నాయకులు సురేశ్, నాగరాజు, ప్రజలు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు..
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి తమ సొంతూళ్లు వెళ్లే ప్రజలు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మేడ్చల్, శామీర్పేట సీఐలు రాజశేఖర్ రెడ్డి, సుధీర్కుమార్ తెలిపారు. వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తూ.. దొంగల బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తాము ఊరెళ్తున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దన్నారు. బంగారు, వెండి అభరణాలతో పాటు నగదును బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళాన్ని అమర్చుకోవాలన్నారు. పోలీస్స్టేషన్లో లేదా ఏరియా పెట్రోలింగ్ చేసే సిబ్బందికి విధిగా సమాచారం ఇవ్వాలని సూచించారు. మీ కాలనీలు, బస్తీలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు గానీ, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. ద్విచక్ర వాహనాలకు పకడ్బందీగా లాక్ చేయడంతో పాటు చక్రాలకు చైన్లాక్ చేయాలన్నారు. న్యూస్ పేపర్, పాల వాళ్లను ఇంటికి రావొద్దని వాహనాలను రోడ్డుపై కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేయాలని వారు సూచించారు.