మారేడ్పల్లి, జూలై 26: కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రెజిమెంటల్బజార్, అంబేద్కర్నగర్, మారేడ్పల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు, చిలకలగూడ చౌరస్తా, మహేంద్రాహిల్స్, వాల్మీకినగర్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాని కి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి.ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటికి రావొద్దని ప్రజలకు సూచించారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మోండా డివిజన్లో పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
రెజిమెంటల్బజార్లోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల రోడ్డు పక్కన ఓ చెట్టు కూలిపోవడంతో వెంటనే సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చెట్టును తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
సికింద్రాబాద్ రైతిఫైల్ బస్టాండ్, ఒలిఫెంటా బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, జలమండలి , మాన్సూన్ అత్యవసర సిబ్బంది వర్షం నీరు సాఫీగా వెళ్లే విధంగా సహాయక చర్యలు చేపట్టారు.
రెజిమెంటల్బజార్, మారేడ్పల్లి, సజ్జన్లాల్ స్ట్రీట్, అంబేద్కర్నగర్, గురుద్వార్ మందిర్ తదితర ప్రాంతాల్లో వర్షం నీటి కాలువలలో నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, చెట్ల కొమ్మలు, చెత్త, చెదారాన్ని తొలగించి వర్షం నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు.