Hyderabad | సిటీబ్యూరో: మీకు వాటర్ బోర్డు ట్యాంకర్ కావాలా? ఐతే ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే రెండు రోజుల నిరీక్షణ తప్పదు ..ఎందుకంటారా వాటర్ ట్యాంకర్ కోసం రోజుకు దాదాపు వందలాది మంది వెయింటింగ్ లిస్ట్లో ఉంటున్నారు.ప్రధానంగా మాదాపూర్, అయ్యప్పసొసైటీ, తట్టిఖానా, మణికొండ, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, మియాపూర్ పరిధిలోని ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ వెయింటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటోంది. భూగర్భజలాలు పడిపోవడంతో నగరంలో నీటి కొరత తీవ్రమవుతున్నది.
గ్రేటర్ వ్యాప్తంగా ప్రస్తుతం 650 ట్యాంకర్లు తిరుగుతున్నాయి. వెస్ట్ కారిడార్లో మాత్రం ట్యాంకర్ నీరు కావాలంటే దాదాపు 24 గంటల పైగా సమయం అవుతున్నది. సాధారణంగా మామూలు రోజుల్లో రోజూ 3500 ట్యాంకర్లు సరఫరా అవుతుండగా, గడిచిన కొద్ది రోజులుగా ఈ బుకింగ్ సంఖ్య 4800 నుంచి 5600ల వరకు పెరిగింది. కొన్ని చోట్ల 24 గంటల నీటి సరఫరా, మరికొన్ని చోట్ల సమయ భావాన్ని తగ్గించి ఫిల్లింగ్ స్టేషన్లకు అదనపు నీటిని సరఫరా చేస్తూ ట్యాంకర్ నీటి డిమాండ్ను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా జలమండలి వివిధ జలాశయాల నుంచి రోజూ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నుంచి 607 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీలు) రోజు తరలించేందుకు అవకాశం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం 565 మిలియన్ గ్యాలన్లు సరఫరా చేస్తున్నారు.
రిజర్వాయర్ల నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని, అవసరమైతే అత్యవసర పంపింగ్ ద్వారా నీటిని తరలించి ప్రజలకు మెరుగైన నీటి సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపాలతో కొన్ని చోట్ల నీటి ఎద్దడి తప్పేలా లేవు. సాధారణ రోజుల్లో గంటన్నర, రెండు గంటల పాటు రోజువిడిచి రోజు సరఫరా చేసే చోట..ప్రస్తుతం వేసవి దృష్ట్యా డిమాండ్ పెరగడంతో అనేక ప్రాంతాల్లో పట్టుమని 40 -60 నిమిషాలు కూడా నీరు సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలు జలమండలి కానీ ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. మిషన్ భగీరథకు సరఫరా చేసే నీటిని గ్రేటర్కే తరలించాలని, తద్వారా దాదాపు 40 ఎంజీడీల నీరు నగర ప్రజలకు అందిస్తే నీటి సమస్యలు ఉత్పన్నం కావని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినప్పటికీ అధికారులు అమలు చేయలేకపోయారు. కేవలం అదనంగా 7 ఎంజీడీలు మాత్రమే మళ్లించినట్లు తెలుస్తున్నది.