హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
అందులో భాగంగా నగరంలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన స్థలాలలో ఎన్నో సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఆ స్థలాలను కేటాయించాలని నిర్ణయించామన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని జీర, సోమప్ప మఠం స్థలాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్న నిరుపేదలు ఆ స్థలంలో తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారని, దేవాదాయ శాఖ కు చెందిన ఈ స్థలాన్ని GHMC కి బదిలీ చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా శ్యామలకుంటలో సుమారు 330 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాయని, GO 58 కింద 2014లో రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. కోర్టు కేసులు ఉన్నందున రెగ్యులరైజేషన్ చేయలేదని వివరించారు. వీరు కూడా తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. అవసరమైన చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.
రాంగోపాల్ పేట డివిజన్ జీరా కాలనీ లో 134 గృహాలు ఉన్నాయని, 1994 సంవత్సరంలో G.O 816 కింద వీరందరు రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
దరఖాస్తు చేసిన సమయంలో ఈ స్థలం విషయంలో సుప్రీం కోర్టులో పలు వివాదాలు పెండింగ్ లో ఉండటంతో ఇండ్ల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సుప్రీం కోర్టులో ఉన్న కేసు 2002 లో లబ్దిదారులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన G.O 816 గడువు ముగిసినందున ఈ దరఖాస్తులు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయని, G.O 816 గడువు ను పొడిగించడం ద్వారా వారికి న్యాయం చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు.
ప్రభుత్వం పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. బన్సీలాల్ పేట లోని మెట్లబావి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల కోసం వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్, వ్యూ పాయింట్ స్కై వాక్, కెఫేటేరియా, బెంచీలు వంటివి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను నిర్దేశిత ఆగస్టు 15 వ తేదీ నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఎంజీ రోడ్ లోని గాంధీ పార్క్ సుందరీకరణ, నూతన గాంధీజీ విగ్రహం ఏర్పాటు కు సంబంధించిన పనుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహానికి అదనంగా 16 ఫీట్ల నూతన గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. నిర్దేశించిన గడువు నాటికి నూతన విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ధి, సుందరీ కరణ పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.