ముషీరాబాద్, జూన్ 6: హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం జీహెచ్ఎంసీ సర్కిల్-15 పరిధిలో ముమ్మరంగా సాగుతున్నది. బస్తీలు, కాలనీల్లో ఎక్కడి సమస్యలను అక్కడే గుర్తించి, పరిష్కరించే దిశగా పట్టణ ప్రగతి కార్యక్రమం ముందుకు సాగుతుంది. త్వరలో వర్షాకాలం మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో వరద నీటి సమస్య, పారిశుధ్యం, సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహణ పెంచుతూ, బస్తీల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం, మట్టికుప్పల తొలగింపు పనులు ముమ్మరం చేశారు. 15 రోజుల పాటు జరుగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన బస్తీల్లో ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధికారులు, నోడల్ అధికారులు పర్యటిస్తూ పారిశుధ్య, మట్టికుప్పలు, చెత్త తొలగింపు పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ప్రధాన రోడ్లు, వరద నీటి సమస్య తలెత్తే ప్రాంతాలు, శ్మశాన వాటికల్లో చెత్త తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. రోడ్లను శుభ్రం చేయడం, దోమల నివారణకై ఫాగింగ్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
నోడల్ అధికారుల పర్యవేక్షణ..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఒక్కో డివిజన్కు ఒక ప్రత్యేక నోడల్ అధికారిని ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన అధికారులు ఇప్పటికే బస్తీలు, కాలనీల్లో పారిశుధ్యం, మట్టి తొలగింపు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై చర్యలు తీసుకుంటున్నారు. చెత్తకుప్పలు వేస్తున్న పాయింట్ల గుర్తింపు, ప్రధాన మార్గాల్లో పారిశుధ్యం, మరుగు దొడ్లు, మూత్ర శాలల నిర్వహణ తీరును పరిశీలించి మార్పులు తీసుకురానున్నారు.
వరద నీటి సమస్యలపై నజర్..
వరద నీటి సమస్య తలెత్తే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. వర్షం కురిస్తే తసమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. విరిగిన మ్యాన్హోల్స్ను గుర్తించి మరమ్మతులు, పల్లపు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టికుప్పల తొలగింపు పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 15 బస్తీల్లో పట్టణ ప్రగతి చేపట్టిన అధికారులు పెద్ద ఎత్తున మట్టికుప్పలు, చెత్త తొలగింపు పనులు చేపట్టారు.
పరిశుభ్రతే లక్ష్యంగా..
పార్కులు, ఆట స్థలాలను పరిశుభ్రంగా మార్చడం, నిర్మాణాల వ్యర్థాలు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టడం జరుగుతున్నది. కాలనీలు, బస్తీల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది.
– డాక్టర్ మైత్రేయి, ఎఎంహెచ్వో సర్కిల్-15