మియాపూర్, మే 15 : పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శేరిలింగంపల్లి జోనల్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం నిర్వహణపై ప్రభుత్వ పరంగా తగు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై జోన్ల్ స్థాయిలో క్షేత్రస్థాయి ప్రణాళికలతో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు సిద్ధం అయ్యారు. ప్రధానంగా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని జోన్ వ్యాప్తంగా సమర్థంగా విజయవంతంగా చేపట్టాలని ఇప్పటికే జోనల్ కమిషనర్ శంకరయ్య కింది స్థాయి అధికారులను ఆదేశించారు. దీనిపై రెండు దఫాలుగా సమావేశాన్ని సైతం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అయితే పట్టణ ప్రణాళికలో ముందస్తుగా జోన్ వ్యాప్తంగా నాలుగు కాలనీలను ఎంపిక చేసిన అధికారులు సదరు కాలనీలలో సోమవారం ట్రయల్ రన్ను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
జోన్ వ్యాప్తంగా 53 బృందాలు.. 539 కాలనీలు
శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా పట్టణ ప్రణాళిక కార్యక్రమం అమలుకు ప్రత్యేక బృందాలను అధికారులు నియమించారు. జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లకు గాను మొత్తం 53 బృందాల నియామకం పూర్తయింది. ఒక్కో బృందంలో శానిటేషన్, బయోడైవర్సిటీ, జలమండలి, ఎంటమాలజీ, విద్యుత్ సహా ఐదు విభాగాల సిబ్బంది ఉంటారు. జోన్ వ్యాప్తంగా నియామకమైన 53 బృందాలు జోన్ పరిధిలోని 539 కాలనీల్లో పర్యటించి చర్యల అమలును పర్యవేక్షిస్తాయి. ప్రధానంగా కాలనీల్లో చెత్త నిల్వల తొలగింపు, ఇంటింటి నుంచి స్వచ్ఛ ఆటోల ద్వారా తడి పొడి చెత్త సేకరణ, మురుగు గుంతలు, నాలాలు, చెరువుల వద్ద దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టడం, హరితహారంలో పెట్టిన మొక్కల సంరక్షణ చర్యలు, వచ్చే ఏడాదికి మొక్కలు నాటేందుకు అనువైన స్థలాల గుర్తింపు, గుంతలు తీయటం వంటి చర్యలను ఈ బృందాలు క్షేత్రస్థాయి సిబ్బందితో చేయించాల్సి ఉంటుంది. తమకు కేటాయించిన కాలనీలలో సంపూర్ణ పారిశుధ్య, పచ్చదనం దోమల నివారణ చర్యలకు ఈ బృందాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే జోన్ పరిధిలోని యూసూఫ్గూడ సర్కిల్లో స్రవంతినగర్, శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో వడ్డెర బస్తీ కాలనీ, చందానగర్ సర్కిల్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ మహోదయ ఎన్క్లేవ్, ఆర్సీపూర్ సర్కిల్ పరిధిలో జ్యోతినగర్ కాలనీలలో సోమవారం ఆయా సర్కిళ్ల డీసీల నేతృత్వంలో సర్కిల్ బృందాలు ఆయా కాలనీలలో మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దే చర్యలను ప్రత్యేకంగా చేపడతారు. తద్వారా జోన్ వ్యాప్తంగా నియామకమైన 53 బృందాలు నేడు క్షేత్రస్థాయిలో ట్రయల్ రన్లో భాగస్వాములవుతాయి.
పకడ్బందీగా పట్టణ ప్రగతి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జోన్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందుకోసం ఇప్పటికే 53 ప్రత్యేక బృందాలను నియమించాం. జోన్ వ్యాప్తంగా ఉన్న 539 కాలనీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ముందస్తుగా సోమవారం జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో ఎంపిక చేసిన నాలుగు కాలనీలో ట్రయల్ రన్ను చేపడుతున్నాం. బృందాలు, అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండి వారికి కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా అమలు చేయిస్తారు. పరిసరాలను మరింతగా మెరుగుపరుచుకుని పచ్చదనాన్ని పెంపొందించుకునేందుకు పట్టణ ప్రణాళిక బృహత్తర కార్యక్రమం. సమర్థంగా అమలు చేసి బల్దియాకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తాం.
– శంకరయ్య, జోనల్ కమిషనర్ శేరిలింగింపల్లి జోన్