సమస్యల పరిష్కారానికి నిర్ణయం
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
ఘట్కేసర్లో పర్యటించిన అదనపు కలెక్టర్
మేడ్చల్ జోన్ బృందం, జూన్ 16 : పట్టణ ప్రగతి కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గురువారం జరిగింది. పాలకవర్గ సభ్యులు, అధికారులు పర్యటించి, సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి 12వ వార్డులో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నూతన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. వైస్ చైర్మన్ ప్రభాకర్, ప్రత్యేక అధికారి రాంచందర్, కమిషనర్ రాములు, వార్డు కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్, ఏఈ సాయిరాంరెడ్డి, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఈఈ నరసింహా రెడ్డి, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
తూంకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజాల్లో పర్యటించి శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు జారీ చేశారు. దళిత వాడల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కౌన్సిలర్ యాదమ్మనర్సింగ్రావు, నర్సింగ్రావు గౌడ్, కమిషనర్ జేతూరామ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ యాదగిరి, ఏఎంసీ మాజీ చైర్మన్ సునీతలక్ష్మి పాల్గొన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని 9వ డివిజన్లో కార్పొరేటర్ శారదామనోధర్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను చదును చేశారు. పిచ్చి మొక్కలను తొలగించి, కాలనీలను శుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. బిల్ కలెక్టర్ సాయి, టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. పీర్జాదిగూడ 26వ డివిజన్ అన్ని డివిజన్లలో ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు ఆయా కార్పొరేటర్లు శ్రమదానం చేశారు. పరిసరాల్లో చెత్తను వేయరాదని, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కమిషనర్ రామకృష్ణారావు, డీఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేవరయాంజాల్లో శిథిలావస్థకు చేరిన నిర్మాణాల కూల్చివేత నోటీసులు అందజేస్తున్న చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు
ఘట్కేసర్ మున్సిపాలిటీ యంనంపేట్ చౌరస్తాలో సుందరీకరణ పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ శ్యాంసన్
ప్రగతి వైపు పట్టణాలు..
ఘట్కేసర్, జూన్ 16 : పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలోని వార్డులు పరిశుభ్రంగా తయారవుతున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీలోని వరంగల్ ప్రధాన రహదారి, చౌరస్తాల వద్ద జరుగుతున్న పనులను చైర్పర్సన్ ఎం. పావనీ జంగయ్య యాదవ్తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ ప్రగతితో మున్సిపాలిటీ ప్రాంతాలు స్వచ్ఛతతో పాటు, మొక్కలకు రంగులు, చౌరస్తాల సుందరీకరణ, పూల మొక్కల కుండీల ఏర్పాటు వంటి పనులు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయని అన్నారు. అనంతరం మున్సిపాలిటీ వాహనాన్ని ప్రారంభించారు. కమిషనర్ వసంత,మేనేజర్ అంజిరెడ్డి, అధికారి వేణుగోపాల్,టీఆర్ఎస్ నాయకుడు ఎం.జంగయ్య యాదవ్ పాల్గొన్నారు.