సిటీబ్యూరో: నగరంలోని సర్కార్ దవాఖానల్లో తాగునీరు లేక రోగులు, వారి సహాయకులు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అధికారులు పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైద్యశాలల్లో నీటి ట్యాంకులు మరమ్మతులకు నోచుకోకపోవడం, అపరిశుభ్రతతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రోగులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ వైద్యశాలల్లో నీటి సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వచ్ఛం ద సంస్థలు ఏర్పాటు చేసిన నీటి కూలర్లు సరైన నిర్వహణ లేక దెబ్బతిన్నాయి.
ఉన్నవి కూడా అపరిశుభ్రంగా ఉంటున్నది. దీంతో తాగునీటి కోసం స్థానికంగా ఉన్న క్యాంటీన్లు, హోటళ్లపైనే ఆధారపడాల్సి వస్తున్నదని రోగుల సహాయకులు వాపోతున్నారు. ఉస్మానియా, నిలోఫర్ తదితర దవాఖానల్లో కొందరు సిబ్బంది స్థానికంగా ఉన్న నీటి వ్యాపారులు, క్యాంటీన్ నిర్వాహకులతో చేతులు కలిపి.. నీటి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్యశాల సి బ్బందే స్వయంగా ఆయా దవాఖానల్లో నీటి వసతి లేకుండా కృత్రిమ సమస్య సృష్టిస్తున్నట్లు సమాచారం. దీంతో తాగునీరు లేక.. రోగులు అక్కడున్న క్యాంటీన్లు, ఇతర నీటి వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.