Revanth Reddy | సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/తార్నాక: ఒడ్డుకు చేరేదాకా ఓడ మల్లన్న… ఆ తర్వాత బోడ మల్లన్న! అనేది సామెత. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం ఒడ్డుకు చేరకముందే బోడ మల్లన్న అంటున్నారు. సాధారణంగా తనలోని నైజం బయటికి తన్నుకొస్తుండటంతో ఆయన నోటి నుంచి దురహంకార వ్యాఖ్యలు జాలువారుతున్నాయి. పది మందికి అన్నం పెట్టే రైతన్నను బిచ్చగాళ్లతో పోల్చి అవహేళన చేసిన ఆ నోరు.. విద్యార్థి లోకాన్ని కూడా వదల్లేదు. ఓయూ విద్యార్థులపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సందర్భంలో రేవంత్రెడ్డి ఉస్మానియా విద్యార్థులను ఉద్దేశించి… ‘చిల్లర ఖర్చులకు తెచ్చుకొని… పక్కనే ఉన్న తార్నాకలో ఉన్న బార్లకు పోయి బీర్లు తాగి ఉంటరు. బీర్లు తాగి, బిర్యానీ తిన్నంక అది అరిగే వరకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటరు. వాళ్లదేం ఉంటది… అడ్డమీది కూలోళ్లు…’ అని వ్యాఖ్యానించడంపై ఉస్మానియా విద్యార్థులు భగ్గుమన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది రేవంత్రెడ్డి వంటి పెయింటర్లు కాదు. వర్సిటీలో ఉండేది అకడమిక్ టాప్ ర్యాంకర్లు. తక్షణమే రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్యార్థి, నిరుద్యోగ యువకులపపై కాంగ్రెస్ పార్టీ వైఖరి రేవంత్ వ్యాఖ్యలతో మరోసారి తేటతెల్లమైంది. బీర్లు, బిర్యానీలకు విద్యార్థులు ఆశపడి, అవి అరిగేవరకు నోటికొచ్చింది అరుస్తారని అనడం ఆయన అవివేకానికి నిదర్శనం. ఇదే ఓయూ వేదికగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక ఉద్యమాలు జరిగిన విషయం ఒకసారి రేవంత్ గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో విద్యార్థి ఉద్యమకారులకు మొండిచెయ్యి చూపి వారిని అవమానించారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
-డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్, ఓయూ జేఏసీ నేత
రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా స్పందించాలి. విద్యార్థి, యువకులను రేవంత్రెడ్డి అవమానించడం సరికాదు. ఓయూలో చిల్లరగాళ్లు, అడ్డమీది కూలోళ్లు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి సభల్లో ప్రసంగించాలనే ఆతృత ఎందుకు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని పట్టుకుని వేలాడుతున్న వారు పునరాలోచించుకోవాలి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం.
– నరేశ్, పీజీ విద్యార్థి
రేవంత్రెడ్డి అగ్రకుల దురహంకారంతో ఓయూ విద్యార్థులను అవమానించిన తీరు గర్హనీయం. కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అడ్డమీది కూలీలతో పోల్చడం సరికాదు. రేవంత్కు దమ్ముంటే ఓయూ క్యాంపస్లో సీటు సాధించి, అప్పుడు మాట్లాడాలి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పోటీపరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినవారికే ఓయూలో సీటు లభిస్తుంది. అది కూడా తెలియకుండా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అయ్యాడో దేవుడికే తెలియాలి. తనలాగే అందరూ బీరు, బిర్యానీలకు అమ్ముడు పోతారని అనుకోవడం ఆయన భ్రమ.
-గౌతం ప్రసాద్, పీజీ విద్యార్థి