Medchal | మేడ్చల్: రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల పెంపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో గ్రామీణ బూత్ స్థాయిలో ఒక పోలింగ్ కేంద్రానికి 1500 మంది అర్బన్ బూత్ స్థాయిలో 1600 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూస్తున్నారు. గ్రామీణ, అర్బన్ బూత్ స్థాయిలో అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే సమీపంలోనే మరో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు అవసరమయ్యే పోలింగ్ స్టేషన్ల జాబితాను పంపించనున్నారు. దీంతో మేడ్చల్-మల్కాజిగిరిలో జిల్లాలో మరిన్ని పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 2397 పోలింగ్ స్టేషన్లు ఉండగా, అందులో మేడ్చల్ నియోజకవర్గంలో 580, మల్కాజిగిరిలో 411, కుత్బుల్లాపూర్లో 582, కూకట్పల్లిలో 417, ఉప్పల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. గ్రామీణ బూత్ స్థాయిలో 1500, అర్బన్ బూత్స్థాయిలో 1600 మంది ఓటర్లు మించిన ఉన్న బూత్లను ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు. ఎన్నికల సంఘానికి పోలింగ్ బూత్ల వివరాలను పంపిన అనంతరం అమోదం లభిస్తే జిల్లాలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.